UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!

  • యూపీ ఎన్నికలకు ముందు ఎస్పీ–కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయితీ
  • ఎస్పీ ఫార్ములా ప్రకారం కాంగ్రెస్‌కు 86 సీట్ల ప్రతిపాదన
  • కాంగ్రెస్ మాత్రం 105–115 సీట్లు కోరుతున్నట్లు సమాచారం
Up Elections

Up Elections

UP Election 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై పంచాయతీ నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిపి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, సీట్ల సంఖ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదే కాకుండా రాయ్ బరేలీ, అమేథీ ప్రాంతాల్లో ఎవరు ఎన్ని స్థానాలు పంచుకోవాలనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

ఎస్పీ కాంగ్రెస్‌కు 86 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని భావిస్తోంది. 2024లో కాంగ్రెస్ గెలిచిన 6 లోక్‌సభ నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుని, అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని ఎస్పీ భావిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ మాత్రం తమకు 105-115 సీట్ల మధ్య కావాలని కోరుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, కాంగ్రెస్ ఏకంగా 120 సీట్ల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. 2017 ఎస్పీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తులో 105 సీట్లు దక్కాయి. రెండు పార్టీల డిమాండ్ల మధ్య 20-30 సీట్ల వ్యత్యాసం కనిపిస్తోంది.

రెండు పార్టీల మధ్య రాయ్‌బరేలీ, అమేథీ ప్రాంతాలు సమస్యకు కారణమవుతున్నాయి. ఈ ప్రాంతాలను తమ కంచుకోటలుగా కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన ఎస్పీ, ఆ ప్రాంతాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. రాయ్‌బరేలీ జిల్లాలో గౌరీగంజ్, అమేథీ అసెంబ్లీ స్థానాలు తమకు దక్కాలని ఎస్పీ భావిస్తోంది. ఇదే కాకుండా, గతంలో ఎస్పీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఎస్పీ భావిస్తోంది. వీరిపై బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టాలని అనుకుంటోంది.

2024 ఫలితాలే చర్చలకు ఆధారంగా మారాయి. ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ 37, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 33 సీట్లకే పరిమితమైంది. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించాయి. ఈ ఫలితాలను ఇరు పార్టీలు తమ సీట్ల డిమాండ్లకు ఉపయోగించుకుంటున్నాయి. కాంగ్రెస్ తన బలం పెరిగిందని చెబుతుండగా, ఎస్పీ మాత్రం మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.