Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..

  • భారత్‌కు యూఏఈ గుడ్ న్యూస్..
  • హార్ముజ్ అవసరం లేకుండానే చమురు రవాణా..
  • ఫుజైరా ద్వారా నేరుగా అరేబియాలోకి చమురు ట్యాంకర్లు..
Uea

Uea

Oil Crisis: ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుండి యూఏఈ నిష్క్రమించడం మిడిల్ ఈస్ట్‌లో ఇంధన రంగ గుత్తాధిపత్యాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కొత్త అవకాశాలను తెరిచింది. మే 1 నుంచి ఈ కూటమి నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఇన్నాళ్లు సౌదీ అరేబియా ఆధిపత్యంలో నడిచిన ఈ ఒపెక్ కూటమి నుంచి యూఏఈ బయటకు వచ్చిన తర్వాత, తన అవసరాలు, ప్రపంచ అసవరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేస్తుంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్‌కు మంచి పరిణామం. యూఏఈ తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు, దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది.

Read Also: E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..

ఇదిలా ఉంటే, ఇప్పుడు యూఏఈ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భారత్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హార్ముజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లిస్తోంది. ఇప్పుడు ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. హార్ముజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.

హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హోర్ముజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్‌ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్ముజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.