Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్‌మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్‌ అరెస్ట్

  • ట్విషా శర్మ రీ-పోస్ట్‌మార్టంలో షాకింగ్ ట్విస్ట్
  • అత్త గిరిబాల సింగ్‌ అరెస్ట్
  • కీలక విషయాలు రాబట్టిన సీబీఐ
Twisha Sharma

Twisha Sharma

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగాక అనేక కీలక విషయాలు రాబట్టింది. ఇక రెండోసారి రీ-పోస్ట్‌మార్టం జరిగాక అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలి పోస్ట్‌మార్టంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్ వచ్చినా.. తాజాగా రెండోసారి జరిపిన పోస్ట్‌మార్టంలో మాత్రం సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్విషా శర్మ దేహంపై ఉన్న గాయాలు.. ఆత్మహత్య తర్వాత జరిగినవి కావని.. ఆత్మహత్యకు ముందే ఆమెపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొంది. ఆత్మహత్యకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్ర పెనుగులాట జరిగిందని.. ఈ ఘర్షణలోనే ట్విషా శర్మకు గాయాలయ్యాయని నివేదికలో వెల్లడైంది.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన భర్త సమర్థ్‌సింగ్, అత్త గిరిబాలా సింగ్ అబద్ధాలు చెబుతుండడంతో సీబీఐ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం సీబీఐ బృందం గిరిబాలా సింగ్ నివాసానికి చేరుకుని విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గిరిబాలా సింగ్‌ను కస్టడీలో విచారించడం అవసరమని మధ్యప్రదేశ్ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా ట్విషా శర్మ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి గిరిబాలా సింగ్ ఏ మాత్రం వెనుకాడలేదని సీబీఐ ఆరోపించింది. ట్విషా శర్మను వరకట్న వేధింపులకు గురి చేశారని.. కీలక ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని.. బలవంతంగా గర్భస్రావం చేయించారని సీబీఐ ఆరోపించింది.

×
×
Ad

ట్విషా శర్మ మణికట్టు, మోచేతుల దగ్గర గాయాల గుర్తులు కనిపించాయని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. ఆ గాయాలు ఎలా వచ్చాయన్న దానిపై అత్తింటి వారు సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. మృతదేహాన్ని ఉరితాడు నుంచి దించేటప్పుడు ఆ గాయాలు ఏర్పడలేదని మెడికల్ రిపోర్ట్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదికలో నమోదైన గాయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక దర్యాప్తులో సేకరించిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్‌లు ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమె వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపింది. పుట్టబోయే బిడ్డ మరొకరికి చెందినదని ఆరోపిస్తూ ట్విషాపై ఒత్తిడి తెచ్చి గర్భస్రావం చేయించారని సీబీఐ పేర్కొంది.