Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..

Tamil Nadu Politics

Tamil Nadu Politics

Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే గవర్నర్‌కు నకిలీ మద్దతు లేఖ సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో విజయ్ గవర్నర్‌ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఇదే సమయంలో, తమ పార్టీ ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్‌కు సమర్పించిందని దినకరన్ ఆరోపించారు. తాము గవర్నర్‌కు అందజేసిన అసలు లేఖ వేరేనని, టీవీకే సమర్పించినది ఫేక్ కాపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై క్రిమినల్ ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. దీంతో దినకరన్ చెన్నైలోని గిండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. టీవీకేపై మోసం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, ఇతర పార్టీల మద్దతు కూడగట్టి గవర్నర్‌ను కలుస్తామని దినకరన్ వెల్లడించారు.

అయితే, ఈ ఆరోపణలను టీవీకే తీవ్రంగా ఖండించింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ స్వయంగా విజయ్‌కు మద్దతు తెలుపుతున్న వీడియోను టీవీకే విడుదల చేసింది. ఆ వీడియోలో కామరాజ్ మాట్లాడుతూ, విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం దినకరన్ సమ్మతితోనే తీసుకున్నామని తెలిపారు. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని టీవీకే స్పష్టం చేసింది. ఇక మరోవైపు, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విజయ్ తనవైపు తిప్పుకుంటున్నారని దినకరన్ ఆరోపించారు. తన పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదని గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే అర్ధరాత్రి తర్వాత కామరాజ్‌ను వెంట తీసుకుని మళ్లీ లోక్‌భవన్‌కు వెళ్లిన దినకరన్, గవర్నర్‌కు తాము సమర్పించిన లేఖ మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రాకముందే నకిలీ మద్దతు లేఖల వివాదం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.