Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం

Shepherd Donates Land

Shepherd Donates Land

Shepherd Donates Land: భూమి కోసం గొడవలు తీవ్రరూపం దాల్చి వివాదాల్లో అమూల్యమైన ప్రాణాలు పోతున్న ఈ కాలంలో ఓ గొర్రెల కాపరి గ్రామం దాహం తీర్చేందుకు తన భూమిని విరాళంగా ఇచ్చాడు. అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనీ ఈ రోజుల్లో ఇతని దానం ఎంతో మందిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న దిండోరి జిల్లాలో ఓ గొర్రెల కాపరి గ్రామంలోని దీర్ఘకాల దాహార్తిని తీర్చడానికి తన భూమిని దానం చేశాడు.

57ఏళ్ల వయస్సు గల గొర్రెల కాపరి తెంకు ప్రసాద్ బన్వాసి తన మూడెకరాల స్థలంలో 1,000 చదరపు అడుగుల స్థలాన్ని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE) విభాగం ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను నిర్మించడానికి విరాళంగా ఇచ్చాడు. దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్‌లోని బార్‌గావ్ గ్రామంలోని 4,500 మంది నివాసితుల నీటి కష్టాలు తీర్చడానికి స్వతహాగా ముందుకొచ్చి ఈ భూరి విరాళాన్ని అందించాడు. అతడిని దీని గురించి అడగగా.. గొప్పగా మాట్లాడాడు.

“నేను గ్రామంలోని గ్రామస్థుల పశువులను పచ్చిక బయళ్లకు మేత కోసం తీసుకెళ్తే వచ్చే జీతంతో జీవిస్తా. కుటుంబ పోషణ కోసం నాకున్న కొద్దిపాటి భూమిలో పంట పండించి కుటుంబాన్ని పోషించుకుంటాను. దీనికి ఆ భూమి ఉపయోగపడుతుంది. కానీ గ్రామస్థుల దీర్ఘకాల నీటి కష్టాల ముందు నా కుటుంబ సమస్య చిన్నగా అనిపించింది. వాటర్ ట్యాంక్ వల్ల నీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోయేలా నేను భూమిలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చాను.” అని గొర్రెల కాపరి వెల్లడించారు. గ్రామంలో నీటి సంబంధిత సమస్యలు త్వరగా తీరేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు గిరిజన గొర్రెల కాపరి ఆదివారం తెలిపారు.

PM Narendra Modi: వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాని మోడీ

గొర్రెల కాపరి భూ విరాళంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆ గొర్రెల కాపరిని అభినందిస్తూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. “నల్ జల్ యోజన కోసం 1,000 చదరపు అడుగుల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా తెంకు బన్వాసి గొప్ప పనిచేశారు. ఈ గొప్ప ప్రయత్నానికి నేను అతనికి నమస్కరిస్తున్నాను.” అని ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. బార్గావ్ గ్రామం చాలా కాలంగా నీటి లభ్యత లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది.

ముఖ్యంగా వేసవి కాలంలో, గ్రామంలోని రెండు ప్రాంతాలైన బన్వాసి మొహల్లా, శంకర్ తోలా నుంచి మహిళలు, పిల్లలు సల్గి నది నుండి నీటిని తీసుకురావడానికి 2.3 కి.మీ వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన బన్వాసి తన గొప్ప మనస్సుతో ట్యాంక్ నిర్మాణం కోసం భూమిని దానం చేశారు. ఇది తెలిసిన పలువురు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.