NTV Telugu Site icon

Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్‌కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..

Goa

Goa

Goa: బ్యాచిలర్లకు, కపుల్స్, ఫ్యామిలీ ఇలా ఎవరికైనా డ్రీమ్ డెస్టినేషన్లలో గోవా తప్పకుండా ఉంటుంది. బీచులు, మందు, విందు, నైట్ లైఫ్ ఇలా ప్రతీది ఆస్వాదించవచ్చు. అయితే, ఇప్పుడు మాత్రం మందు తాగుతూ, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తామంటే కదరదు. గోవాలోని ఫేమస్ బీచుల్లో ఒకటైన ‘కలంగుట్’ బీచ్‌కి వచ్చే వారు తప్పకుండా హోటల్ రిజర్వేషన్లను చూపించాలని అక్కడి స్థానిక గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు విచ్చలవిడిగా ప్రవర్తించడం, గ్రామానికి చెడ్డపేరు తెచ్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..

పర్యాటకులు తమ గ్రామ పరిధిలోకి ప్రవేశించే ముందు హోటల్ రిజర్వేషన్లను తప్పనిసరిగా చూపించాలని తీర్మానం చేసింది. గ్రామ పరిసరాల్లో చెత్తను విసిరేసేవారిపై పన్ను విధించాలని నిర్ణయించింది. ‘‘పర్యాటకులు జీపులు, బస్సులతో గుంపులుగా వస్తారు. బీచ్ ప్రాంతంలో మద్యం సేవిస్తారు. అక్కడే వంట చేసుకుని చెత్తను విసిరేస్తు్న్నారు. ఇప్పుడు హోటల్ రిజర్వేషన్ వెరిఫికేషన్ కోసం చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇష్టారీతిగా ప్రవర్తించే వారిపై పన్ను, ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించుకున్నాము’’ అని గ్రామ సర్పంచ్ జోసెఫ్ సిక్వెరా తెలిపారు.

గతంలో మహాబలేశ్వర్‌లో కూడా ఇలాంటి తీర్మానాన్ని తీసుకువచ్చినట్లు కలంగుట్ పంచాయతీ గుర్తు చేసింది. కలంగుట్ బీచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పంచాయతీ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని తీర్మానం పేర్కొంది. పర్యాటకులు బీచ్‌ని పబ్లిక్ టాయి‌లెట్‌గా ఉపయోగిస్తున్నారని, ఇస్టారీతిలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, మద్యం తాగి సీపాలు, చెత్తను విసిరేసి వెళ్తున్నట్లు పంచాయతీ పేర్కొంది.