Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి కన్నా ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే మమతా బెనర్జీని ఇంకా ఎక్కువ భయపెడుతున్నాయి. మరికొంత కాలం తర్వాత టీఎంసీ ఉంటుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అరాచకాలపై సీఎం సువేందు అధికారి విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు, పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం దీదీని కలవరపెడుతోంది.
తాజాగా అస్సాం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అభిజిత్ మజుందార్ శుక్రవారం పార్టీకి రాజీనమా చేశారు. మజుందార్ తన లేఖను మమతా బెనర్జీకి ఈమెయిల్ చేశారు. తన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో పార్టీ ప్రతిష్ట క్రమంగా ‘‘కేవలం ముస్లింల కోసమే పనిచేసే సంస్థ’’గా మారిందని ఆరోపించారు. ఇదే వైఖరి బెంగాల్లో కూడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను టీఎంసీలో కొనసాగలేదనని, పార్టీ పనితీరు, రాజకీయ దిశ కారణంగా సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఆయన అన్నారు.
ఇప్పటికే బెంగాల్ టీఎంసీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వందలాది మంది పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి సంబంధిత వివాదాలపై పార్టీని సమర్థించలేకపోతున్నానని అన్నారు. ఇక టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ మరో రెండేళ్ల వరకు టీఎంసీ నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.
