Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో ఉద్యమం పురుడుపోసుకుంటోంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలు జరిగిన 45 రోజల తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ నిబంధనలకు వ్యతిరేకంగా, కుల ఆధారిత రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో వేలాది మంది జనరల్ కేటగిరీకి చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. నిరసనకారులు బ్యానర్లు, పోస్టర్లు, కాషాయ జెండాలతో హాజరై తమ డిమాండ్లపై నినదించారు.
రిజర్వేషన్ ప్రయోజనాలు వాస్తవంగా అవసరమైన వ్యక్తులకు చేరేలా విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయం, విద్యా అవకాశాలు, స్కాలర్షిప్లు, కోచింగ్ వంటి ప్రయోజనాలకు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరికొంత మంది నిరసనకారులు ఎస్సీ/ఎస్టీ చట్టంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈచట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు చేయాలని కోరారు. రిజర్వేషన్లో ‘క్రీమీ లేయర్’ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే SC, ST, OBCలకు సంబంధించిన రిజర్వేషన్ విధానాల్లోనూ మార్పులు చేయాలని కోరారు.

