పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4, 2026న వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల తర్వాతి రోజుల్లో స్ట్రాంగ్ రూమ్లలో అవకతవకలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా బహబనీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన సఖావత్ మెమోరియల్ స్కూల్లోని స్ట్రాంగ్ రూమ్ను ఏప్రిల్ 30 రాత్రి సందర్శించారు. గంటల తరబడి (సుమారు 3-4 గంటలు) లోపలే ఉండి, రాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వస్తూ మమతా బెనర్జీ మాట్లాడుతూ, “ఇది ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మేము చాలా చోట్ల అవకతవకలు (మానిప్యులేషన్) జరుగుతున్నట్లు గుర్తించాము. టీవీలో సీసీటీవీ ఫుటేజ్ చూసి, నేను స్వయంగా వచ్చి చూడాలని నిర్ణయించాను” అని అన్నారు. అంతేకాకుండా, కేంద్ర బలగాలు తనను అడ్డుకోవడానికి ప్రయత్నించాయని, ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు సీల్ చేసిన గది బయటకు వెళ్లే హక్కు ఉందని చెప్పినప్పుడు మాత్రమే వెళ్లనిచ్చారని ఆమె ఆరోపించారు. ఏవైనా అవాంతరాలు తలెత్తితే “లైఫ్ అండ్ డెత్ ఫైట్” చేస్తానని మమతా హెచ్చరించారు.
బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూస్తున్నాయని టీఎంసీ ఆరోపణలు గుప్పించింది. “ఇది బెంగాల్. ఇది బీహార్ లేదా మహారాష్ట్ర కాదు” అని టీఎంసీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా పోస్టు ద్వారా తీవ్రంగా స్పందించింది. నేతాజీ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్లో ఒక్క టీఎంసీ సభ్యుడు కూడా లేనప్పుడు బ్యాలెట్ బాక్సులను బలవంతంగా తెరవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఆ పార్టీ ఆరోపించింది.
ఎన్నికల సంఘం స్పందన:పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ టీఎంసీ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. స్ట్రాంగ్ రూమ్లు పక్కాగా సీల్ చేయబడి ఉన్నాయని, ఎవరూ లోపలికి ప్రవేశించలేరని, ఎన్నికల ప్రక్రియ 100% స్వచ్ఛంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
