NEET: నీట్ రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

  • నీట్ పరీక్ష రద్దుకు నో చెప్పిన సుప్రీంకోర్టు..
  • మళ్లీ రీ ఎగ్జామ్ అవసరం లేదని ఈ రోజు తీర్పు..
  • 24 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమన్న సుప్రీం.. భవిష్యత్తులో లీకులు జరగకుండా చూసుకోవాలని కేంద్రానికి సూచన..
There Will Be No Neet Re Exam, Rules Supreme Court

There Will Be No Neet Re Exam, Rules Supreme Court

NEET: నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత దశలో పరీక్షాల ఫలితాలు విఫలమయ్యాయని లేదా ఏదైనా క్రమబద్ధమైన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించే అంశాలు రికార్డులో లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షా ప్రశ్నాపత్రం వ్యవస్థాగతంగా లీక్ అయిందనే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు చెప్పింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, పరీక్షలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది.

Read Also: Hamas: పాలస్తీనా కోసం ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్.. బీజింగ్ వేదికగా ఒప్పందం..

నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రద్దు చేస్తే ఈ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పింది. సీబీఐ నివేదిక ప్రకారం దర్యాప్తు జరుగుతోందని మరియు హజారీబాగ్ మరియు పాట్నాలోని పరీక్షా కేంద్రాల నుండి 155 మంది విద్యార్థులు పేపర్ లీక్‌‌తో లబ్ధిపొందినట్లు కనిపిస్తోందని సీబీఐ చెప్పిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

మే 5న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. జూన్ 4న వీటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 4750 సెంటర్లలో నీట్ యూపీ పరీక్షలు నిర్వహించారు. విదేశాల్లో 14 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అయితే, ఈ పరీక్ష ఫలితాల అనంతరం ప్రశ్నాపత్నం లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచారణ చేస్తోంది. ఇదిలా ఉంటే నీట్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి లీకులు జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పింది.