Manmohan Singh: నేను జైలులో ఉన్నప్పుడు అండగా నిలిచారు.. మలేషియా ప్రధాని భావోద్వేగం..

  • మిత్రమా వీడ్కోలు..
  • మన్మోహన్ సింగ్ మరణంపై మలేషియా ప్రధాని భావోద్వేగం..
  • జైలులో ఉన్న సమయంలో అండగా నిలిచారన్న అన్వర్ ఇబ్రహీం..
Pm Anwar Ibrahim, Manmohan Singh

Pm Anwar Ibrahim, Manmohan Singh

Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్తగా కొనియాడుతోంది. ఆయన మరణం పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా తెలియజేశారు.

Read Also: Japan: జపాన్ ప్రధాని నివాసంలో ‘‘దెయ్యాలు’’.. ఈ ఇళ్లు అంటే ఎందుకు అంత భయం..?

భారత ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా మన్మోహన్ సింగ్‌ని అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించడానికి సహకరించారని అన్నారు. 1990లో తాము ఇద్దరం ఆర్థిక మంత్రులుగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ నిజంగా ప్రశంసలకు అర్హుడని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, దృఢంగా నిలబడి రాబోయే తరాలకు స్పూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చినట్లు చెప్పారు.

నేను జైలులో ఉన్న సమయంలో, తనపై మన్మోహన్ సింగ్ జాలి చూపారని చెప్పారు. తన పిల్లలకు, ముఖ్యంగా తన కొడుకు ఇహ్సాన్‌కి స్కాలర్‌షిప్ ఇచ్చిన విషయాన్ని చెప్పారు. అయితే, తాను ఈ ఆఫర్‌ని తిరస్కరించానని, ఇది మన్మోహన్ సింగ్ అసాధారణమైన మానవత్వాన్ని, ఔదార్యాన్ని సూచిస్తుందని చెప్పారు. తాను జైలులో ఉన్న చీకటి రోజుల్లో తనకు నిజమైన స్నేహితుడిగా నిలిచారని, మన్మోహన్ సింగ్ తన హృదయంలో నిలిచిపోతారని చెప్పారు. వీడ్కోలు మిత్రమా, నా సోదరుడా మన్మోహన్ సింగ్ అని సంతాప సందేశాన్ని తెలిపారు.