Terrorist Digital Plan: దేశంలోని ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను విస్తరించేందుకు, సరిహద్దుల అవతల ఉన్న తమ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించేందుకు అత్యంత అధునాతన మార్గాలను ఎంచుకుంటున్నారు. భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకోవడానికి వారు సరికొత్త ‘డిజిటల్ కోడ్వర్డ్’లను ఉపయోగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో తేలింది. ముఖ్యంగా విదేశీ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్లే ఇప్పుడు ఉగ్రవాదులకు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
ఎన్క్రిప్టెడ్ యాప్స్ నుంచే అంతా..
లష్కరే తోయిబా (LeT), జైషే మహమ్మద్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన లష్కర్ ఉగ్రవాది ‘హురైరా’ను విచారించిన ఎన్ఐఏ అధికారులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. నిఘా అధికారులకు చిక్కిన ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్ కనీసం మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ లేకుండానే పనిచేస్తాయి. దీనివల్ల వారిని ట్రేస్ చేయడం లేదా వారి మాటలను డీకోడ్ చేయడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థల రడార్లో ప్రధానంగా ‘త్రీమా’ అనే స్విస్ ఆధారిత మెసేజింగ్ యాప్ ఉంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగిన ప్లాట్ఫామ్. ఇందులో ఖాతా తెరవడానికి వ్యక్తిగత సమాచారం ఏదీ అవసరం లేదు.
డస్ట్ మెసెంజర్ అనే అమెరికాకు చెందిన యాప్ను కూడా ఉగ్రవాదులు విరివిగా వాడుతున్నారు. దీని ద్వారా సరిహద్దుల అవతల ఉన్న నేతలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఎలిమెంట్ అనే ప్లాట్ఫామ్ను సమాచార మార్పిడి కోసం లష్కర్ ఉగ్రవాదులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డిజిటల్ నెట్వర్క్ను ఛేదించేందుకు NIA, ఇతర భద్రతా సంస్థలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ యాప్స్ ద్వారా సరిహద్దుల అవతల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? ఏయే ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేశారు? అనే కోణంలో డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి టెర్రరిస్టులు ఇలాంటి టెక్నాలజీని వాడుతుండటం అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
