Site icon NTV Telugu

Tejasvi Surya: డీలిమిటేషన్‌పై కావాలనే అలజడి సృష్టిస్తున్నారు.. విపక్షంపై తేజస్వీ సూర్య ఆరోపణలు

Tejasvi Surya

Tejasvi Surya

డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణ భారతదేశ ప్రజల్లో గందరగోళం వ్యాపింపజేస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుపై అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు.

‘‘రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. డీలిమిటేషన్‌ను సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నది అవాస్తవం. కేరళలో 10 సీట్లు పెరుగుతున్నాయి. ఇది కేరళకు లాభమే కదా?, అలాగే ఏపీ, తెలంగాణలో కూడీ సీట్లు పెరగబోతున్నాయి. జీఎస్‌‌డీపీ ఆధారంగా సీట్లు పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది ఫూలిష్ ప్రతిపాదన. రేవంత్‌రెడ్డికి సలహా ఎవరిచ్చారో తెలియదు. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు కావాలనే రాద్ధాంతం చేస్తోంది. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం.’’ అని తేజస్వీ సూర్య చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై విపక్షాలు ఓటింగ్ కోరాయి. దీంతో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా మూడు బిల్లులకు అనుకూలంగా 207 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇంత హఠాత్తుగా బిల్లులు తీసుకొచ్చారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

ఇక నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌తో సహా మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటు హక్కు రాజకీయ న్యాయమేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మూడు బిల్లులూ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్ర అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.

Exit mobile version