Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

  • అరవ రాజకీయాల్లో ‘ఒక్క ఓటు’ సెగ
  • ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన కేఆర్ పెరియకరుప్పన్
  • హైకోర్టుకు చేరిన తిరుపత్తూరు పోరు
Tamil Nadu Election Result

Tamil Nadu Election Result

Tamil Nadu Election Twist: తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెను సంచలనం సృష్టించాయి. సినిమాలో వచ్చే ట్విస్ట్‌లకు మించి అరవ రాజకీయాల్లో ఇటీవల నెలకొన్న పరిణామాలు యావత్ దేశాన్ని తమిళనాడు వైపు చూసేలా చేశాయి. ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన దళపతి విజయ్ టీవీకే పార్టీకి అధికారం అందుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఈ రోజు దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అన్నీ సద్దుమణుగుతున్నాయని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అరవ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్ చోటుచేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే..

తమిళనాడులోని తిరుపత్తూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న అనూహ్య ఫలితంపై మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కేఆర్ పెరియకరుప్పన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన తిరుపత్తూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న అనూహ్య ఫలితంపై సవాలు విసిరారు. హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి శ్రీనివాస సేతుపతి విజయాన్ని సవాలు చేస్తూ ఆయన తాజాగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌లోని ప్రధానాంశాలు ఇవే..
కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండా, అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించాలని కోరారు. అలాగే అసెంబ్లీలో జరగబోయే విశ్వాస తీర్మానంలో సదరు అభ్యర్థి ఓటు వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా, మద్రాస్ హైకోర్టు ఆదివారం నాడే ప్రత్యేక విచారణ జరపాలని నిర్ణయించడం గమనార్హం.

తమిళనాడులో విజయ్ ‘టీవీకే’ ప్రభంజనం
తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు రాగా, పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. అయితే ఈ గెలుపు వెనుక మస్కట్ నుంచి వచ్చిన మణికందన్ శివానంతం అనే యువకుడి ఓటు కీలకమైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ పార్టీకి ఓటు వేయడానికే తాను విదేశాల నుంచి వచ్చానని ఆ యువకుడు పోస్ట్ చేయడంతో, ఆ ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారు చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో 2024లో స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ, తొలి ఎన్నికల్లోనే తమిళనాడు రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి నయా రికార్డును సృష్టించింది. కొలత్తూరులో మాజీ సీఎం ఎం.కే.స్టాలిన్ స్వయంగా టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి మిత్రపక్షాల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. దీంతో అన్ని అడ్డంకులను అధిగమించి, కూటమి మద్దతుతో టీవీకే అధినేత విజయ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ తిరుపత్తూరు నియోజకవర్గ వివాదం ఇప్పుడు కోర్టులో ఎలాంటి మలుపు తిరగబోతోందనేది ఆసక్తిగా మారింది.