NTV Telugu Site icon

Swati Maliwal: తనపై జరిగిన దాడి గురించి తొలిసారి స్పందించిన స్వాతి మలివాల్.. ఏమన్నారంటే..?

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై జరిగిన దాడి గురించి తొలిసారి స్పందించారు. సోమవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంకి ఫిర్యాదు చేసి సాయం కోసం అభ్యర్థించింది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం రేపింది. ఆ తర్వాత తనపై జరిగిన దాడిని ఒప్పకుంటూనే అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయలేదు.

Read Also: Mumbai: ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో భార్యాభర్తల మృతదేహాలు గుర్తింపు

ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టీం ఆమె నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. దాడి గురించి ఆరా తీశారు. దీనిపై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. తొలిసారిగా తనపై జరిగిన దాడి గురించి స్వాతి మలివాల్ స్పందించింది. ‘‘ నాకు జరిగినది చాలా చెడ్డది. నాకు జరిగిన ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నాకు చాలా కష్టంగా ఉంది. నా కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా క్యారెక్టర్‌‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారు.. వేరే పార్టీ సూచనల మేరకే ఈ పని చేస్తున్నానని చెబుతున్న వారిని కూడా భగవంతుడు సంతోషంగా ఉంచాలని కోరుతున్నాను. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి స్వాతి మలివాల్ ముఖ్యం కాదు, దేశ సమస్యలే ముఖ్యం. ఈ ఘటనపై రాజకీయాలు చేయొద్దని బీజేపీకి నా ప్రత్యేక విన్నపం’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ ఘటనపై ఆప్ విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక ముఖ్యమంత్రి నివాసంలోనే మహిళ ఎంపీకి రక్షణ లేదని బీజేపీ విమర్శిస్తోంది. దీంతో పాటు ఈ ఘటనపై కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. బుధవారం కేజ్రీవాల్ నివాసం ముందు బీజేపీ మహిళా మోర్చా నిరసన వ్యక్తం చేసింది. నిందితుడిని కేజ్రీవాల్ రక్షిస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.