ప్రేమించి బయట పెళ్ళిచేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకుంటుంటారు. అలా చేసుకుంటే ఇక వారికి గుర్తింపు వుండదు. ఆర్య సమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఆర్య సమాజ్కు లేదని ధర్మాసనం పేర్కొంది.
అధికారులు జారీచేసిన వివాహ ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఆర్యసమాజ్ ఇచ్చేవాటికి చట్టబద్ధమయిన గుర్తింపు లేదని సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది.మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మైనర్ అయిన తమ కుమార్తెను ఓ యువకుడు అపహరించి అత్యాచారం చేసినట్లు పేర్కొన్న అమ్మాయి తల్లిదండ్రులు.. అతనిపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోస్కో చట్టం ప్రకారం కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన యువకుడు మేజర్ అయిన అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఈ మేరకు ఆర్యసమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రం సమర్పించగా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆర్యసమాజ్ లో పెళ్ళిళ్ళు చేసుకున్నవారి పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. వారు విధిగా రిజిస్ట్రార్ దగ్గర వివాహ ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సి వుంటుంది.