చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పకూడదని కేంద్రాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో స్తంభించి ఉన్న నగదు.. ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి చట్టపరమైన వారసులకు తెలియజేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ సుచేతా దలాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
‘‘ఒక వ్యక్తికి వేర్వేరు దేశాల్లో 10 వేర్వేరు ఖాతాలు ఉండి.. అతను వీలునామా లేకుండా మరణిస్తే.. అతని వారసులకు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? అతను కేవైసీ (KYC) చేయించి ఉండకపోవచ్చు… ఇది విధానపరమైన ప్రశ్న కాదు. ఆ బదిలీ చట్టవిరుద్ధమని మేము చెప్పడం లేదు. మేము అంటున్నది ఏమిటంటే.. చట్టపరమైన వారసులకు సమాచారం ఇస్తే తప్పేంటి? మీరు ఏదైనా ఒక విధానంతో ముందుకు రావాలి.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
విచారణ సందర్భంగా దలాల్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బహిరంగపరచాలని పిటిషనర్ ఆదేశాలు కోరారని పేర్కొన్నారు. మరణించిన తమ తల్లిదండ్రుల ఖాతాలను ప్రజలు గుర్తించుకునేందుకు వీలుగా ఒక “కేంద్రీకృత మరియు శోధించదగిన డేటాబేస్” ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ కూడా సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ఇక కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ మాట్లాడుతూ.. ఒకవేళ నిజమైన వారసుడు ముందుకు వస్తే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని వారికి వాపసు ఇస్తారని తెలిపారు. అయితే ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్బీఐలను సుప్రీంకోర్టు ఆదేశించి.. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
