Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!

Supreme Court

Supreme Court

Supreme Court: దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న పెండింగ్ కేసులు, తీర్పుల ఆలస్యాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను అనవసరంగా ఆలస్యం చేయకుండా ఉండేందుకు అన్ని హైకోర్టులకు స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం, హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు ప్రకటించాల్సి ఉంటుంది. మూడు నెలలు దాటినా తీర్పు వెలువడని పక్షంలో, సంబంధిత కేసును ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.

అలాగే, ఇంకా ఆలస్యం కొనసాగితే ఆ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం కూడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల తీర్పుల జాప్యాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో కోర్టు ముందుకు సాగుతోంది. ఇక ప్రతి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పెండింగ్‌లో ఉన్న రిజర్వ్డ్ జడ్జ్‌మెంట్‌ల జాబితాను ఆయా హైకోర్టుల చీఫ్ జస్టిస్‌కు క్రమం తప్పకుండా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానం ద్వారా పెండింగ్ తీర్పులపై సమీక్ష సులభం అవుతుందని భావిస్తున్నారు. తీర్పుల ఆలస్యం వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయానికి తీర్పులు ఇవ్వడం న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు ఎంతో ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు న్యాయ వ్యవస్థలో పారదర్శకత, వేగం పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

×
×
Ad