ఢిల్లీలోని నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సత్య నికేతన్ భవనం కూలిన ఘటనకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. నివాస భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, సరైన భద్రతా చర్యలు లేకుండానే పెద్ద సంఖ్యలో వ్యక్తులను ఒకే చోట ఉంచుతున్నారని ధర్మాసనం పేర్కొంది.
అమికస్ క్యూరీ అజిత్ కుమార్ సిన్హా కోర్టుకు పలు విషయాలను వివరించారు. ఢిల్లీలోని అనేక నివాస భవనాలను జిమ్లు, కోచింగ్ సెంటర్లు, బీపీవోలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా స్పందిస్తూ.. “సార్డిన్లను ప్యాక్ చేసినట్లు వందల మందిని ఒకే గదిలో కుక్కేస్తున్నారు.. లోపలికి వెళ్లేందుకు, బయటకు రావడానికి కూడా సరైన మార్గాలు ఉండటం లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 15లోగా నివేదికలు ఇవ్వాలి
ఢిల్లీలోని నివాస భవనాల వాణిజ్య వినియోగంపై స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD), ఢిల్లీ ప్రభుత్వం సహా సంబంధిత అధికారులంతా సెప్టెంబర్ 15లోగా నివేదికలు సమర్పించాలని సూచించింది. సత్య నికేతన్ ఘటన తర్వాత తీసుకున్న చర్యలను MCD కోర్టుకు వివరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
సత్య నికేతన్లో జరిగిన ఘటన ఒక్క భవనానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని అజిత్ కుమార్ సిన్హా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని అనేక నివాస భవనాలను నిబంధనలకు విరుద్ధంగా పీజీలు, విద్యార్థి హాస్టళ్లు, ఇతర వాణిజ్య సంస్థలుగా మార్చుతున్నారని తెలిపారు. ఇప్పటికే నివాస ప్రాంతాల్లో అక్రమ వాణిజ్య కార్యకలాపాలపై కోర్టు పలు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అనేక చోట్ల భవనాల వినియోగంలో మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సత్య నికేతన్ ఘటన నేపథ్యంలో ప్రధానంగా అక్రమ నిర్మాణాలు, నివాస భవనాల దుర్వినియోగం అనే రెండు అంశాలు వెలుగులోకి వచ్చాయని అమికస్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా వరకు నివాస భవనాల్లోనే నిర్వహిస్తున్నారని, అనధికారికంగా అదనపు నిర్మాణాలు, మార్పులు లేదా భవన వినియోగంలో మార్పులు చేసి ఉండే అవకాశం ఉందని వివరించారు.
భవన నిబంధనలు పాటిస్తున్నారా?
ఈ భవనాలు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్కు అనుగుణంగా ఉన్నాయా? భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తున్నారా? నిర్మాణపరంగా సురక్షితంగా ఉన్నాయా? అనుమతించిన భూ వినియోగ నిబంధనల మేరకే ఉపయోగిస్తున్నారా? అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.
సత్య నికేతన్లో ఏడుగురు మృతి
ఢిల్లీలోని సౌత్ క్యాంపస్ సమీపంలోని ప్రముఖ విద్యార్థి ప్రాంతమైన సత్య నికేతన్లో ఐదు అంతస్తుల పీజీ భవనం ఇటీవల కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన తర్వాత ఢిల్లీలోని అసురక్షిత భవనాలపై అధికారులు దృష్టి సారించారు. పీజీలు, హాస్టళ్లు, నివాస భవనాల్లో నడుస్తున్న వాణిజ్య సంస్థలకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలనే డిమాండ్లు కూడా పెరిగాయి.
వచ్చే వారం మరోసారి విచారణ
MCD, ఢిల్లీ ప్రభుత్వం, ఇతర సంబంధిత అధికారులు సమర్పించే నివేదికలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చే వారం ఈ అంశాన్ని మరోసారి విచారించే అవకాశం ఉంది. ఢిల్లీలో నివాస భవనాల వాణిజ్య వినియోగం, PGలు, హాస్టళ్ల భద్రతపై తదుపరి కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

