మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను గట్టిగా మందలించింది సుప్రీం కోర్ట్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది నుపుర్ శర్మ. తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మకు అక్షింతలు వేశారు.
తను చేసిన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ మీడియా ముఖంగా దేశానికి క్షమాపణలు చెప్పాలని, సదరు టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించిన తీరుపై ఆమె ఒంటరిగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆమె లాయర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్ అయినా.. ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు నుపుర్ శర్మను టచ్ చేయలేదని విమర్శించింది. ఇలాంటి చర్చలు పెట్టే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నుపుర్ శర్మ డిబెట్ ను మేం పూర్తిగా చూశామని సుప్రీం కోర్ట్ వెల్లడించింది.
Read Also:BJP National Executive Meeting: బీజేపీ టార్గెట్ అదే.. అందుకే హైదరాబాద్ వేదికగా సమావేశాలు..!
ఆమె తరుపున వాదించిన మణిందర్ సింగ్ సుప్రీం కోర్టుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. కోర్టు మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మకు గర్వం, అధికారం తలకెక్కాయని వ్యాఖ్యానించింది. ఇటువంటి వాళ్లు చీప్ పబ్లిసిటీ ఎజెండాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని వ్యాఖ్యానించింది. నీ వల్లే ఉదయ్ పూర్ ఘటన జరిగిందంటూ సుప్రీం కోర్ట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ చర్చ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇచ్చారని నుపుర్ శర్మ లాయర్ కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిగా ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుంది.. ప్రజాస్వామ్యంలో గడ్డి పెరిగే హక్కు ఉంది, గాడిదకు తినే హక్కు ఉంది’’ అని న్యాయమూర్తి ఘాటుగా బదులిచ్చారు. నుపుర్ శర్మపై దాఖలైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
