Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం

  • రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం
  • సోనమ్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
  • మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
Sonam Raghuvanshi

Sonam Raghuvanshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. మూడు వారాల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. అయితే, విచారణలో జాప్యం జరిగితే ఆరు నెలల తర్వాత కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బెయిల్ రద్దు కోరిన మేఘాలయ ప్రభుత్వం

సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న షిల్లాంగ్ కోర్టు ఆమెకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

విచారణలో ఏమి జరిగింది?

సోనం రఘువంశీ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో మొత్తం 94 మంది సాక్షులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు నాలుగురి సాక్షుల వాంగ్మూలాలు మాత్రమే నమోదు అయ్యాయని, అదనపు చార్జ్‌షీట్ కూడా దాఖలైందని చెప్పారు. అలాగే సోనం పరారీలో లేదని, ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అరెస్టు అయ్యిందని, దానిని లొంగిపోవడంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాదించారు. బెయిల్ షరతులను ఆమె పూర్తిగా పాటిస్తోందని, పరారయ్యే అవకాశం లేదని కూడా తెలిపారు.

మేఘాలయ ప్రభుత్వ వాదన

మేఘాలయ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చార్జ్‌షీట్‌లో నమోదైన వివరాల ప్రకారం సోనం స్వయంగా లొంగిపోయిందని పేర్కొన్నారు. చట్టంలోని సెక్షన్‌కు సంబంధించిన ఒక చిన్న టైపింగ్ పొరపాటును ఆధారంగా తీసుకుని బెయిల్ ఇవ్వడం సరైంది కాదని వాదించారు. అలాగే బెయిల్ కొనసాగితే సోనం పరారయ్యే అవకాశం ఉందని కూడా ఆయన కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సమాజంలో వస్తున్న మార్పులపై కూడా వ్యాఖ్యానించింది. “సమాజంలో మార్పులు సహజం. నేటి తరం మా తరం కంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో వారు మరింత సున్నితంగా ఉంటున్నారు.” అని కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, “వారి వద్ద సమాచారం ఎక్కువగా ఉంది, కానీ జ్ఞానం కాదు” అని వ్యాఖ్యానించారు. దానికి జస్టిస్ వరాలే స్పందిస్తూ, “వాట్సాప్‌లో వచ్చే ప్రతి విషయాన్నీ జ్ఞానంగా భావించే పరిస్థితి ఏర్పడింది” అని వ్యాఖ్యానించారు.

రాజా రఘువంశీ హత్య కేసు ఏమిటి?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ వివాహం అనంతరం తన భార్య సోనం రఘువంశీతో కలిసి 2025 మే 21న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. మే 26న ఈ దంపతులు కనిపించకుండా పోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అనంతరం జూన్ 2న, సోహ్రా సమీపంలోని ప్రసిద్ధ వెయి సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో ఉన్న లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది.

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు

పోలీసుల దర్యాప్తు ప్రకారం, సోనం రఘువంశీకి రాజ్ కుష్వాహాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజాను హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. హనీమూన్‌ను నెపంగా ఉపయోగించి, ముందుగా ప్రణాళిక ప్రకారం రాజాను హత్య చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం, ఆకాశ్ సింగ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు వ్యక్తులు సోనం సమక్షంలో రాజాను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.