కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన మార్చ్ను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఈ మార్చ్ నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే నిరసన సందర్భంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 5న జరగనున్న నిరసన మార్చ్ శాంతిభద్రతలు, విధానపరమైన అంశాలతో ముడిపడి ఉందని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. వీటిని సంబంధిత శాంతిభద్రతల సంస్థలు, ఇతర భాగస్వాములు పరిష్కరించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కోర్టు జోక్యం చేసుకోవాల్సిన బలమైన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు.
రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రిజ్వాన్ అహ్మద్ వాదనలు వినిపించారు. జూలై 20న జంతర్ మంతర్ దగ్గర జరిగిన సీజేపీ నిరసన సందర్భంగా గాయపడిన పోలీసు సిబ్బందికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచి వసూలు చేయాలని పిటిషన్లో కోరారు. పార్లమెంట్, ఇతర కీలక ప్రభుత్వ సంస్థలకు సమీపంలో నిర్వహించే నిరసనలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్ కోరారు. నిరసనలు నిర్వహించకూడని ప్రాంతాలు లేదా రక్షిత ప్రాంతాలను సహేతుకమైన పరిధిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రతి అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించలేదని సీజేఐ స్పష్టం చేశారు.
నిరసనలకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీని ఆశ్రయించాలని సీజేఐ సూచించారు. “అన్ని అంశాలను మేము పరిశీలించలేం. ప్రతి విషయంపైనా వ్యాఖ్యానించం. మేము ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీని ఆశ్రయించండి” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఒక్కో అంశాన్ని కమిటీ పరిశీలించి తమ అభిప్రాయాలను కోర్టుకు సమర్పిస్తుందని తెలిపారు. ఈ కమిటీని సీజేఐ ‘తటస్థ అంపైర్’గా అభివర్ణించారు. నిరసనలకు సంబంధించిన విస్తృత విధానపరమైన, శాంతిభద్రతల అంశాలపై సంబంధిత వర్గాలు చర్చించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు సీజేపీ తాజా నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనున్న విషయాన్ని న్యాయవాది రిజ్వాన్ అహ్మద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విదేశీ ప్రముఖులు ఢిల్లీకి రానున్న నేపథ్యంలో భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని, అందువల్ల నిరసన మార్చ్ను బ్రిక్స్ సదస్సు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఆయన వాదించారు. అయితే సీజేఐ స్పందిస్తూ.. “ఇవి శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలు. నిర్ణయం శాంతిభద్రతల సంస్థలే తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరిస్తారని మేము విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి మేము జోక్యం చేసుకోవడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు” అని పేర్కొన్నారు.
ఒకవేళ నిరసన సందర్భంగా ఏదైనా అవాంఛనీయ లేదా ఆందోళనకర ఘటన చోటుచేసుకుంటే.. పిటిషనర్ కొత్తగా దరఖాస్తు చేసుకుని కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ తెలిపారు. ఈ కేసును నిరసనలు, వాటికి సంబంధించిన ఇతర అంశాలపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న పిటిషన్లతో కలిపి తదుపరి విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సెప్టెంబర్ 5న కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ మార్చ్ చేపడుతోంది.

