శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురువారం మధ్యాహ్నం గురుద్వారా ప్రాంగణంలో ఓ వ్యక్తి కిర్పాన్తో ఆయనపై దాడికి యత్నించాడు. ఈ ఘటనలో బాదల్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నాందేడ్లోని గురుద్వారా మాతా సాహిబ్ దేవన్ జీ ముగత్లో గురువారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాకు వచ్చిన సుఖ్బీర్ సింగ్ బాదల్పై నిహాంగ్ జస్పాల్ సింగ్ తేజ్పాల్ అనే వ్యక్తి కిర్పాన్తో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించడంతో దాడి మరింత తీవ్రం కాలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలు, వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
దాడిలో బాదల్ కుడి చేతికి గాయమైంది. చికిత్స కోసం ఆయనను యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు సీనియర్ సర్జన్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కిర్పాన్ దాడి కారణంగా చేతికి గాయం కావడంతో స్థానిక మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స చేపట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆయన రక్తపోటు కొంత పెరిగినట్లు వెల్లడించారు. నాందేడ్ కలెక్టర్ రాహుల్ కార్డిలే, పోలీస్ సూపరింటెండెంట్ నిలాభ్ రోహన్, ఐజీపీ, సివిల్ సర్జన్ తదితర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. సుఖ్బీర్ బాదల్ భద్రతా విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ సంతోష్ కేండ్రే కూడా నిందితుడి దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. బాదల్ను రక్షించే ప్రయత్నంలో ఆయనకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఫడ్నవీస్ ఆరా
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. నాందేడ్ ఎస్పీ నుంచి పూర్తి స్థాయి నివేదికను కోరారు. దాడికి గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్తో ఫడ్నవీస్ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాదల్ పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
సుఖ్బీర్ బాదల్ భద్రతలో ఏమైనా లోపాలు జరిగాయా? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు భద్రత కల్పించామని, ఎస్పీ కార్యాలయం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. అయినప్పటికీ ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు.
అకాలీదళ్ ఆందోళన
ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్ జాతీయ ఉపాధ్యక్షుడు సంజీవ్ తల్వార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురుద్వారాలో దర్శనానికి వెళ్తున్న సమయంలో బాదల్పై దాడి జరగడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని పేర్కొన్నారు. బాదల్ కుడి చేతికి గాయమైందని, ఆయనను రక్షించే క్రమంలో భద్రతా అధికారికి కూడా గాయాలయ్యాయని తెలిపారు. బాదల్పై జరిగిన దాడిని కేవలం వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా పంజాబ్ ఐక్యత, సమగ్రతపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మాజీ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బాదల్కు Z+ భద్రత ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తారు.
రాజకీయ నేతల ఖండన
బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అన్నారు. రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ.. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు కారణం కాలేవని పేర్కొన్నారు. పంజాబ్ ఇప్పటికే ఎన్నో సంవత్సరాల హింస, ఉగ్రవాదాన్ని ఎదుర్కొందని.. అలాంటి పరిస్థితులు మళ్లీ రావడానికి అనుమతించకూడదని బిట్టూ అన్నారు. బాదల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు.
పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ వంటి పవిత్ర ప్రదేశంలో హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. శాంతి, సేవ, ధ్యానం, సర్వ మానవ సంక్షేమం సందేశాన్ని అందించే పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనకు చోటు ఉండకూడదని అన్నారు. సుఖ్బీర్ బాదల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
2024లోనూ బాదల్పై కాల్పులకు యత్నం
సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2024 డిసెంబర్లో మాజీ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ఉగ్రవాది, ఖలిస్థానీ కార్యకర్త నరైన్ సింగ్ చౌరా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద బాదల్పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో మతపరమైన శిక్షలో భాగంగా బాదల్ గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం దగ్గర ‘సేవాదార్’గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆ కాల్పుల ఘటనలో బాదల్కు ఎలాంటి గాయాలు కాలేదు.
The cowardly attempt on Sardar Sukhbir Singh Badal Ji’s life is deeply condemnable and a direct threat to Punjab’s peace and security.
Violence and intimidation have no place in our holy shrines. The perpetrators must be exposed and punished, and those responsible for the…
— Ravneet Singh Bittu (@RavneetBittu) August 13, 2026

