Stampede: విజయ్ ర్యాలీలపై బ్యాన్..కోర్టుకు వెళ్లిన బాధితుడు..

  • విజయ్ ర్యాలీలను బహిష్కరించాలి..
  • మద్రాస్ హైకోర్టులో పిటిషన్..
Vijay

Vijay

Stampede: తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అధికార డీఎంకే పార్టీ నేతలు విజయ్‌పై విరుచుకుపడుతున్నారు. పోలీసు నిబంధనలు పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఈ విషాద ఘటనలో 40 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు.

అయితే, తొక్కిసలాటలో గాయపడినట్లు చెప్పుకుంటున్న బాధితుడు సెంథిల్ కన్నన్, ఈ రోజు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించనునంది. ఈ విషాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు టీవీకే బహిరంగ సభలను నిషేధించాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌దారుడు కన్నన్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రమాదం కాదని, నిర్లక్ష్య ప్రణాళిక, తీవ్ర దుర్వినియోగం, ప్రజా భద్రతను పూర్తిగా విస్మరించడం వల్ల సంభవించిన ప్రత్యక్ష ఫలితం అని అన్నారు.

Read Also: Tamil Nadu : తమిళనాడు డీజీపీ వెంకటరామన్ స్పందన, విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, ప్రజాభద్రత ప్రమాదంలో పడినప్పుడు, సమావేశాలు నిర్వహించే హక్కును రద్దు చేయాలని వాదించారు. తమిళనాడు పోలీసులు టీవీకే ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. తొక్కిసలాట విషాదానికి సంబంధించి కరూర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కూడా పిటిషన్ ఎత్తి చూపింది.

కరూర్‌లోని వేలుస్వామిపురంలో శనివారం జరిగిన ర్యాలీలో విజయ్ ఆలస్యంగా రావడంతో పెద్ద సంఖ్యలో జనం రావడం వల్ల ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్, జస్టిస్ జస్టిస్ అరుణా జగదీసన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పలువురు టీవీకే అగ్ర నాయకత్వంపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, స్వతంత్ర విచారణ జరిపించాలని, ఈ ఘటనలో కుట్రకోణం ఉందని, సీబీఐ దర్యాప్తు చేయాలని విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.