Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు

  • తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్
  • 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
  • ఎల్‌నినోపై హెచ్చరించిన వాతావరణ శాఖ
Monsoon1

Monsoon1

అన్నదాతలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1 ప్రాంతంలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు.

వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బంగాళాఖాతంలోని నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య ప్రాంతాలతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం మిగిలిన ప్రాంతాల్లో కూడా రుతుపవనాల పురోగతి కొనసాగవచ్చని అంచనా వేసింది.

×
×
Ad

వాస్తవానికి మే 26నే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. అయితే అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో రాక ఆలస్యమైంది. అనంతరం మే 29న విడుదల చేసిన తాజా ప్రకటనలో వచ్చే వారం రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా సవరించిన అంచనాల ప్రకారం.. 2026లో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఎల్‌పీఏ అంటే ఒక ప్రాంతంలో 30 నుంచి 50 సంవత్సరాల కాలంలో నమోదైన సగటు వర్షపాతం. 1971 నుంచి 2020 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా భారతదేశం మొత్తం సీజనల్ సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. ఈ సగటులో 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని ఐఎండీ ‘లోటు వర్షపాతం’ (Deficient Rainfall)గా పరిగణిస్తుంది.

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలకు ప్రధాన కారణంగా ఎల్‌నినో పరిస్థితులను ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో తటస్థ ఎల్‌నినో-సదర్న్ ఆసిలేషన్ (ENSO) పరిస్థితులు క్రమంగా ఎల్‌నినో వైపు మారుతున్నాయని తెలిపింది. జూన్ నెలలో ఎల్‌నినో ప్రభావం స్వల్పంగా ఉండొచ్చని, సెప్టెంబర్ నాటికి అది మధ్యస్థం నుంచి బలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.