Sonipat Viral Incident: ఇటీవల హర్యానా పానిపట్లో తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్లో చూసిన కూతురు సంఘటన వైరల్గా మారిన సంగతి తెలిసిందే. సొనిపట్లోని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న శివచరణ్ దాస్ రతన్ గుప్తా ఇటీవల మరణించారు. ఆయన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరు కూడా దహన సంస్కారాలకు హాజరుకాలేదు. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియల్ని చూశారు. ఆస్థికల నిమజ్జనం సమయంలో కూడా వాట్సాప్ కాల్ ద్వారా మాత్రమే సంప్రదించారు.
ఇప్పుడు, తండ్రి 13వ రోజు కర్మ కార్యక్రమాలకు కూడా కుమార్తెలు హాజరుకాలేదు. హిందూ సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సామాజిక సంస్థల ప్రతినిధులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. అయితే శివచరణ్ కుటుంబం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ముఖ్యంగా ముగ్గురు కుమార్తెలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. కుమార్తెలను సంప్రదించినప్పటికీ వారు పదమూడో రోజు కార్యక్రమాలకు రావడానికి నిరాకరించారని తెలిపారు. అన్ని కార్యక్రమాలను వృద్ధాశ్రమ నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రజలు పూర్తి చేశారు.
ఇదిలా ఉంటే, శివచరణ్ బతికే ఉన్నాడన్న విషయం ఆయన సోదరుడు మహేంద్ర గుప్తాకు కూడా పదేళ్ల పాటు తెలియదని సమాచారం. మహేంద్ర తన సోదరుడు నేపాల్ భూకంపంలో చనిపోయాడని భావిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ద్వారా శివచరణ్ బతికే ఉన్న విషయం తెలసుకుని మహేంద్ర హరిద్వార్ వెళ్లారు. అక్కడే శివచరణ్ అస్థికలను నిమజ్జనం చేశారు.

