NTV Telugu Site icon

ప్ర‌ధానికి సోనియా లేఖ‌.. అనాథ‌లైన చిన్నారుల్లో భ‌రోసా క‌ల్పించండి..

Sonia Gandhi

క‌రోనా ఫ‌స్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయి.. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి.. చిన్నారులు అనాథ‌లుగా మిగిలిపోయిన‌వారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భ‌రోసా క‌ల్పించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్ర‌ధాని లేఖ రాసిన ఆమె… అనాథ‌లైన చిన్నారుల‌కు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని ఉజ్వల్ భవిష్యత్ అందించాల‌ని కోరిన సోనియా.. కోవిడ్ 19తో తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన చిన్నారులకు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని లేఖ‌లో పేర్కొన్నారు. వారి జీవితంలో అనుకోకుండా నిండిన విషాదం త‌ర్వాత చిన్నారుల‌కు గొప్ప భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు. ఒక దేశంగా, వారికి సంభవించిన అనూహ్యమైన విషాదం త‌ర్వాత వారికి బలమైన భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు.. ఇక‌, దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల సృష్టి ఆమె భర్త మరియు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క అత్యంత ముఖ్యమైన వారసత్వమని లేఖ‌లో గుర్తుచేశారు సోనియా గాంధీ.