నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థులకు మద్దతుగా 26 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురుగ్రామ్లోని మెదాంతా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో వాంగ్చుక్ దంపతులు పోలీసు భద్రత మధ్య రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీ సమాధి దగ్గర తెల్లని వస్త్రాన్ని సమర్పించి నివాళులు అర్పించారు.
రాజ్ఘాట్లో మీడియాతో మాట్లాడిన సోనమ్ వాంగ్చుక్.. తన 26 రోజుల నిరాహార దీక్ష ముగిసిన తర్వాత మొదటగా మహాత్మా గాంధీని స్మరించేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘‘మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గం వందేళ్ల క్రితం ఎంత ప్రాసంగికమో, నేటికీ అంతే ప్రాసంగికంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి దేశ ప్రజలకు ఆ సందేశాన్ని మరోసారి గుర్తు చేయడానికి రాజ్ఘాట్కు వచ్చాను.’’ అని అన్నారు. లడఖ్లో గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా తాను గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నానని, అదే విధానం జాతీయ స్థాయిలో కూడా ఫలిస్తుందని ఈ ఉద్యమం నిరూపించిందని పేర్కొన్నారు. శాంతియుత ఉద్యమాల ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వాంగ్చుక్ అభిప్రాయపడ్డారు. ‘‘బాపూ చూపిన శాంతి మార్గంలోనే ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. పరిష్కారం ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. హింస కాదు, అహింసే విజయానికి మార్గం.’’ అని అన్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని అభినందించారు. ‘‘మన విజయం బలప్రయోగం వల్ల రాలేదు. లాఠీలు, రాళ్లు కాదు… శాంతియుత నిరసన, త్యాగం, సహనమే ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశాయి.’’ అని చెప్పారు. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన వాంగ్చుక్.. అది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నారు. ‘‘రాజీనామా అనేది మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తే దేశ విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య సానుకూల చర్చలు జరగాలని ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. ‘‘శాంతియుత నిరసన ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు. దాన్ని గౌరవించాలి. దురుద్దేశంతో వ్యవహరించే వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. కానీ శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను వేధించకూడదు.’’ అని స్పష్టం చేశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా వాంగ్చుక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నాను. ముందుగా రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, అనంతరం తిరిగి లడఖ్కు వెళ్తాను. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మెదాంతా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు.’’ అని పేర్కొన్నారు.
26 రోజుల దీక్ష ఎలా ముగిసింది?
సీజేపీ పిలుపునిచ్చిన ‘‘పార్లమెంట్ మార్చ్’’కు రెండు రోజుల ముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ను జంతర్మంతర్ నిరసన స్థలం నుంచి తొలుత సఫ్దర్జంగ్ ఆస్పత్రికి, అనంతరం గురుగ్రామ్లోని మెదాంతా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వాంగ్చుక్ను కలిసి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని హామీ ఇవ్వడంతో ఆయన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు.
#WATCH | Delhi | Activist Sonam Wangchuk, along with his wife Gitanjali Angmo, offers tributes at Rajghat, soon after getting discharged from Medanta Hospital in Gurugram. pic.twitter.com/voNfoVmsyD
— ANI (@ANI) July 27, 2026

