NTV Telugu Site icon

Doda attack terrorists: దోడా ఉగ్రదాడి నిందితుల స్కెచ్ విడుదల.. సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డ్..

Doda Attack Terrorists

Doda Attack Terrorists

Doda attack terrorists: ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా లోయ ప్రాంతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు కాశ్మీర్‌లో తమ ప్రాక్సీలను ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయి. జమ్మూ ప్రాంతంలోని రియాసి, కథువా, దోడా జిల్లాలు నియంత్రణ రేఖను ఆనుకుని ఉండటం, ఆ ప్రాంతంలో కొండలు లోయలు, అడవులు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నాయి.

Read Also: Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు

గత వారం దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో కెప్టెన్‌తో సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. ఈ దాడిలో పాల్పడిన ఉగ్రవాదుల స్కెచ్‌లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల సమాచారం ఇస్తే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సీనియర్ పోలీస్ అధికారులు ప్రజలు చేరుకోవడానికి కంట్రోల్ రూపం‌తో సహా డజన్లకు పైగా మొబైల్ నెంబర్లు ఇచ్చారు.

జూలై 16న దోడా జిల్లాలో భారీ ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర మరియు సిపాయి అజయ్ నరుకా మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్‌ మద్దతుగల ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (జేఎం)కి అనుబంధంగా ఉన్న ‘కాశ్మీర్‌ టైగర్స్‌’ అనే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వీరి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమతో పంచుకోవాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.