Sivaganga Court Sentences 27 People To Life Imprisonment: తమిళనాడులో 2018లో కొంత మంది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తుల అహంకారానికి ముగ్గురు షెడ్యూల్ కులాల వ్యక్తులు బలయ్యారు. కాచనాథం ట్రిపుల్ మర్డర్ కేసుగా దేశంలో అప్పట్లో సంచలన సృష్టించింది. తాజాగా ఆ కేసులో శివగంగ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2018 లో తమిళనాడు శివగంగ జిల్లా కచనాథమ్ లో ముగ్గురు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులను చంపిన నేరం కింద 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. అగ్రకులానికి చెందిన నలుగురు బాలనేరస్థులతో పాటు మొత్తం 33 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రత్యేక న్యాయమూర్తి జి. ముత్తుకుమరన్ దోషులను నిర్థారిస్తూ శిక్షను ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం బుధవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు విచారణలో ఇప్పటికే ఒకరు మరణించగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు
2018 మే 28న కాచనాథంలో ఆలయ మర్యాదల విషయంలో గొడవ చెలరేగింది. ఆలయ మర్యాద విషయంలో అగ్రకులస్తులను, షెడ్యూల్ కులస్తులు నిలదీయడంతో ఈ దాడి జరిగింది. తమను ప్రశ్నించారనే నెపంతో ఆగ్రహంతో అహం దెబ్బతిన్న అగ్ర కులస్తులు.. షెడ్యూల్ కులానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. మే 28, 2018 రోజున గ్రామంలో కరెంట్ కట్ చేసి ఇళ్లలోకి చొరబడిన వ్యక్తులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కే. అరుముగం, ఏ. షణ్ముగనాథణ్, వి. చంద్ర శేఖర్ అనే ముగ్గురు వ్యక్తుల మరణించారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ కేసులో నలుగురు బాలనేరస్థులతో పాటు 33 మంది నిందితులుగా ఉన్నారు. ఆగస్టు 1న, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దోషులు, బాధిత కుటుంబసభ్యుల వాదనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్నారు. అంతకుముందు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు కూడా కామెంట్స్ చేసింది. దోషులు చేసుకున్న అప్పీళ్లను కొట్టేసింది. అగ్రకులాలు చేసిన క్రూరత్వం సమాజంలో శాంతి, ప్రశాంతతలపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది.