Sidhu Moose Wala: పంజాబ్ లో ఎన్‌కౌంటర్.. సిద్దూ మూసేవాలా చంపిన నిందితులు ఖతం

Punjab Encounter

Punjab Encounter

Siddu Musewala murder case: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులకు, పోలీసులు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం అమృత్‌సర్ జిల్లాలోని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అట్టారీ బార్డర్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్ నగర్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో సిద్దూ మూసేవాలా హత్యతో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ జగ్రూప్ సింగ్ రూపం, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్నూ కుస్సాను పోలీసులు హతమార్చారు. పోలీసులు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ వార్తా ఛానెల్ కెమెరాపర్సన్ కు కూడా గాయాలయ్యాయి. అతని కుడి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సిద్దూ మూసేవాలా హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు షూటర్లలో వీరు కూడా ఉన్నారు. మరో షూటర్ దీపక్ ముండి జాడ ఇంకా తెలియలేదు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత మంది ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం హతమైన ఇద్దరు నిందితులు కూడా పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామం అయిన తర్న్ తరన్ గ్రామానికి చెందిన వారు.

Read Also: Best Camera Phones: రూ. 20 వేలలోపు లభ్యమయ్యే టాప్-10 కెమెరా ఫోన్స్

పక్కా సమాచారంలో పోలీసులు వీరిద్దరు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. పంజాబ్ పోలీసులు యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ఫోర్క్ ఈ ఎన్‌కౌంటర్ లో పాల్గొన్నాయి. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నాయకుడు అయిన శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలాను ఈ ఏడాది మే 29న పంజాబ్ మన్సా గ్రామంలో అత్యంత దారుణంగా కాల్చి చంపారు. తన కారులో బయటకు వెళ్తున్న క్రమంలో కాపుకాసి హత్య చేశారు. సిద్దూ మూసేవాలా మర్దర్ లో తొలుత ఏకే 47తోొ మన్ ప్రీత్ సింగ్ కాల్చి చంపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్స్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ హస్తం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పంజాబ్ లోని భగవంత్ మాన్ ఆప్ సర్కార్ వీఐపీ కల్చర్ కు చరమగీతం పాడాలని పంజాబ్ లో పలువురి సెక్యురిటీని తగ్గించింది. ఇలా సెక్యురిటీ తగ్గించిన తర్వాతి రోజు సిద్దూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు.