Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్‌గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు

  • సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ!
  • రేపే చేస్తారంటూ మీడియాలో కథనాలు
  • హాట్ టాఫిక్‌గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
Siddaramaiah

Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా కథనాలు వస్తున్నాయి. హైకమాండ్ మాత్రం అదేమీ లేదంటూ తోసిపుచ్చుతోంది. రేపు ఏం జరగబోతోందనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఈ ఉత్కంఠ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌.వి.దేశ్‌పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నాకు చెప్పారు. గురువారం రాజీనామా సమర్పించే అవకాశం ఉంది” అని దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సిద్ధరామయ్య రాజీనామా సిద్ధపడినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా జరుగుతున్న కుర్చీ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అంతేకాకుండా అధిష్టానం నిర్ణయానికి తలొగ్గాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన కీలక చర్చల తర్వాత సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకుని ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలపై జోరుగా చర్చ సాగింది. అయితే మంగళవారం గంటల తరబడి జరిగిన సమావేశాల అనంతరం కూడా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. అంతేకాకుండా నాయకత్వ మార్పు వార్తలను కాంగ్రెస్ అధిష్ఠానం ఖండించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఢిల్లీలో జరిగిన చర్చలు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల వ్యూహాలకే పరిమితమయ్యాయని స్పష్టం చేశారు.

2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అప్పగిస్తారన్న ప్రచారం అప్పట్లోనే ప్రారంభమైంది. అయితే పార్టీ అధికారికంగా ఎప్పుడూ దీనిని ధృవీకరించలేదు. ఇటీవల ప్రభుత్వం రెండున్నరేళ్ల మైలురాయికి చేరువ కావడంతో మరోసారి నాయకత్వ మార్పుపై చర్చ మొదలైంది. సీఎం పదవిపై ప్రశ్నించగా డీకే శివకుమార్ “సమయమే సమాధానం చెబుతుంది” అంటూ వ్యాఖ్యానించగా.. సిద్ధరామయ్య మాత్రం తాను ఐదేళ్లు పూర్తి చేస్తానని.. తుది నిర్ణయం హైకమాండ్‌దేనని పలుమార్లు తెలిపారు. అయితే గత కొన్ని నెలలుగా కర్ణాటక కాంగ్రెస్‌లో ఇరు వర్గాల ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగానే తమ తమ నాయకులకు మద్దతుగా నిలవడం రాజకీయ వేడిని మరింత పెంచింది.