Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..

  • రైలులో బర్త్ డే వేడుకలు..
  • రైలులో టికెట్ తనికీ సిబ్బంది సెలబ్రేషన్స్..
  • విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు..
  • ఇటీవల రైలులోనే హనీమూన్ ఏర్పాట్లు..
Indian Railways

Indian Railways

Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ విమర్శలు ఎదుర్కొంది. ఇది మరవకముందే బర్త్ డే పార్టీ వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ గుండా వెళుతున్న న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో టికెట్ తనిఖీ సిబ్బంది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ 44 సెకన్ల వీడియోలో, ఝాన్సీకి చెందిన తనిఖీ సిబ్బంది తమ డ్యూటీ యూనిఫాంలో మరో ఉద్యోగి బర్త్ డే వేడుకలు నిర్వహించడం వీడియోలో కనిపించింది. కేక్ కట్ చేసి, పూలమాల వేస్తూ ఉద్యోగులు కనిపిస్తారు. ఈ సంఘటన మూడు నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.

తాజా బర్త్ డే ఘటనలో ఉద్యోగులు న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ఇన్స్‌పెక్టర్లని భావిస్తున్నారు. విధి నిర్వహణలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో తన దృష్టికి వచ్చిందని ఝాన్సీ డివిజన్ పీఆర్ఓ మనోజ్ కుమార్ తెలిపారు. దీనిపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది.

గతంలో జూన్ 6, 2026న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక హనీమూన్ సూట్ ఏర్పాటు చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ దీనిని సమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో టికెట్ తనఖీ సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేశారు.