పంజాబ్‌ సంక్షోభం.. రాజీనామాకు సీఎం రెడీ..?

పంజాబ్‌ కాంగ్రెస్‌ సర్కార్‌లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన అధిష్టానం.. సీఎం అమరీందర్‌సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.. కానీ, ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి.. కొంత శాంతింపజేసినా.. అమరీందర్‌ సింగ్‌ ను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది.. కానీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అక్కడ అసమ్మతి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, ఈ నేపథ్యంలో సీఎంగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను తప్పించడానికి కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.. కెప్టెన్‌ను తప్పించి సిద్ధూకు పగ్గాలు ఇచ్చే అవకావం ఉందనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. సీఎం పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసే అవకాశం ఉందనే వార్త కూడా హల్‌చల్‌ చేస్తోంది.. ఏ క్షణమైనా అమరీందర్‌ సింగ్‌.. గవర్నర్‌ను కలిసి.. రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఇవాళ సాయంత్రం 5 గంటలకు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది.. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాల్సింది అధిష్టానం ఆదేశించింది.. తాజా పరిణామాలపై చర్చించి.. భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.. సీఎం రాజీనామా ప్రచారం సాగుతుండడం.. ఇదే సమయంలో అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.