హిమాచల్ ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసం అయ్యాయి. గత వారం హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కాగా, దీని ప్రభావం వలన ఇప్పుడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ ప్రాంతానికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక వీకెండ్లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. కరోనా నిబంధనలు సడలించడంతో పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తున్నారు. దీంతో వసతి గృహాలన్నీ నిండిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో అనేక మంది టూరిస్టులు ఉన్నారు. అయితే, ప్రమాదాన్ని గుర్తించిన కొందరు పర్యాటకులు అక్కడి నుంచి పరుగులు తీసి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి.