West Bengal Politics: పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో మంట పెడుతోంది. మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీపై ఏర్పడిన ఆగ్రహం దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. సాధారణ ప్రజలే టీఎంసీ కార్యకర్తలు, నేతలపై దాడికి దిగుతున్నారు. ఇక మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మరో ఎంపీ, మమత నమ్మినబంటు కళ్యాణ్ బెనర్జీలపై దాడులు జరిగాయి.
ఇక మమత పెట్టే మీటింగ్లకు మెజారిటీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. పార్టీలో నెంబర్ 2 అభిషేక్ బెనర్జీపై దాడి తర్వాత మమత తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరుకావడంతో, సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక స్థానికం సంస్థల్లోనే టీఎంసీ ప్రజాప్రతినిధులు వరస్గగా రాజీనామాలు చేస్తున్నారు.
టీఎంసీలో ఏక్నాథ్ షిండేగా రీటబ్రత బెనర్జీ.?
మహారాష్ట్ర రాజకీయాలు బెంగాల్లో రిపీల్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. శివసేనను విభజించి ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు చెక్ పెట్టారు. ఇప్పుడు ఇదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్లో మొదలైనట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు టీఎంసీ ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను మమతా బెనర్జీ బహిష్కరించింది. ఇప్పుడు రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోనే టీఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేలు మరో వర్గంగా ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే, 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది మమతా బెనర్జీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేలతో రీటబ్రత భేటీ అవ్వడం సంచలనంగా మారింది. దీంతో తృణమూల్ను మమత, అభిషేక్ బెనర్జీ నుంచి లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మమత మేనల్లుడే టార్గెట్:
బెంగాల్లో అధికారం కోల్పోవడానికి కారణాలుగా మెజారిటీ ఎమ్మెల్యేలు అభిషేక్ బెనర్జీ వైఖరి, ఐ-ప్యాక్ నిర్ణయాలను పార్టీపై రుద్దడాన్ని భావిస్తున్నారు. అవినీతి, అహంకారం, బంధు ప్రీతి, సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. 15 ఏళ్ల అధికారంలో పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలకు దూరమైందని, మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని, దక్షిణ కోల్కతాలోని ఒక హోటల్లో కొంత మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ ఆరోపించారు. అయితే దీనిని రిటబ్రత ఖండించారు.
టీఎంసీ ఎమ్మెల్యేల్లో భయం:
అభిషేక్, కళ్యాణ్ బెనర్జీలపై దాడులతో మొత్తం టీఎంసీ ఎమ్మెల్యేలు భయానికి గురవుతున్నారు. స్థానిక ప్రజలే ఎదురుతిరగడం చూస్తుంటే, తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ వ్యతిరేకత తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం సువేందు అధికారి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కట్ మనీ వ్యవహారం, తృణమూల్ దోపిడీలు, గుండాయిజంపై విచారణ వేగవంతం చేశారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యేల్లో ఆందోళనను పెంచుతున్నాయి.
ప్లీజ్ పార్టీని వదిలేయకండి: టీఎంసీ ఎమ్మెల్యే..
మునిగిపోతున్న పార్టీని వదిలేయవద్దని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ సహచర ఎమ్మెల్యేలను కోరారు. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల, 29 మంది ఎంపీలలో సగాని కన్నా ఎక్కువ మంది (సుమారు 40-45 మంది ఎమ్మెల్యేలు, 15-18 మంది ఎంపీలు) మమత పార్టీ వారి చేతుల్లోకి వెళ్లినట్లే. సోమవారం, కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. మునిగిపోతున్న ఓడను వదిలిపెట్టవద్దని టీఎంసీ నాయకులను చేతులు జోడించి వేడుకున్నారు.
