RBI New Governor: ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం

  • ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం
  • మూడేళ్ల పాటు గవర్నర్‌గా ఉండనున్న మల్హోత్రా
  • మంగళవారంతో ముగియనున్న శక్తికాంత దాస్ పదవీకాలం
Sanjaymalhotra

Sanjaymalhotra

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా.. రెవెన్యూ కార్యదర్శిగా పని చేస్తున్నారు. మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఇప్పుడు ఆర్బీఐ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు ఉండనున్నారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగుస్తోంది. శక్తికాంత దాస్.. గత శనివారమే ఆర్బీఐ పాలసీని ప్రకటించారు. ఇదే ఆయన చివరి సమీక్ష కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Road Accident: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 10 మందికి తీవ్రగాయాలు

మల్హోత్రా..కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, యూఎస్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేసిన అనుభవం ఉంది. రెవెన్యూ కార్యదర్శిగా పనిచేయక ముందు ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మరియు పన్నుల విషయంలో విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.

ఇది కూడా చదవండి: Delhi: విషాదం.. హాస్టల్‌లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి

శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగియనుండడంతో అతని స్థానంలో మల్హోత్రా నియమితులయ్యారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత డిసెంబర్ 12, 2018న శక్తికాంత దాస్ RBI 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం ముగిశాక కూడా.. ఆయన పదవీ పొడిగింప బడింది.