NTV Telugu Site icon

ISIS: తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్ఐఏ వెల్లడి..

Nia

Nia

ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది. దేశంలో ఉగ్రవాదాన్ని, హింసను పెంచాలని వారంతా భావించినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నిందితులంతా బాగా చదువుకున్నవారే అని.. వీరిలో సాంకేతికత గురించి తెలిసిన వారున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పూణేలో అనేక సమావేశాలు నిర్వహించడంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉగ్రవాదం కోసం సభ్యులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు చార్జిషీట్ పేర్కొంది.

Read Also: Israel-Hamas War: గాజా కాల్పుల విరమణకు ఫ్రెంచ్ అధ్యక్షుడి పిలుపు.. రేపు మీపైన కూడా దాడి జరుగొచ్చన్న ఇజ్రాయిల్..

ఐఈడీ కోసం రసాయనాలు కొనుగోలు చేయడానిక సల్ఫ్యూరిక్ ఆసిడ్, అసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం వెనిగర్, రోజ్ వాటర్, షెర్బాత్ వంటి కోడ్ పేర్లను ఉపయోగించారు. నిందితులు ఇండియాలో ఐఎస్ఐఎస్ భావజాలాన్ని పెంచాలని అనుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘‘రివేంజ్ ఆన్ కాఫిర్స్’’ అనే క్యాప్షన్‌తో ప్రచారాన్ని ప్రారంభించారు. వీటికి సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కాఫీర్లు(ముస్లింయేతరులు) పగతీర్చుకోవాలని నిందితులు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. నిందితులంతా విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు దాడులకు సంబంధించిన ప్లాన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టచ్ లో ఉన్నట్లు తేలింది.