Ram Temple consecration: అయోధ్యలో జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ వేడక కోసం దేశవ్యాప్తంగా రామ భక్తులు, హిందువులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు 7000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే యోగి ప్రభుత్వం అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి దళిత దిగ్గజ నేతలైన బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్, ఇతర షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కరసేవలకులను కూడా ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలతో పాటు ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖ సినీ, స్పోర్ట్స్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ మహత్తర ఘట్టానికి హాజరుకాబోతున్నారు. 50 దేశాలలో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన 55 మంది ఆహ్వానితుల్లో ఉన్నారని తెలుస్తోంది.
