Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ram Mandir Trust First CEO: అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సీఈవోను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల అన్వేషణ కమిటీ సెప్టెంబర్ 1న ట్రస్ట్‌కు తన నివేదికను సమర్పించింది. సెప్టెంబర్ 2న ట్రస్ట్ సమావేశం కానుండగా, ఆ భేటీ అనంతరం తొలి సీఈవో పేరును ప్రకటించే అవకాశం ఉంది. సీఈవో పదవి కోసం మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం 16 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఆగస్టు 3 నుంచి 6 వరకు వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించగా, ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలో ముఖాముఖి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ప్రక్రియ అనంతరం సెర్చ్ కమిటీ ముగ్గురితో కూడిన తుది ప్యానెల్‌ను రూపొందించి ట్రస్ట్‌కు అందించింది.

రేసులో నాలుగు పేర్లు
సీఈవో పదవి కోసం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రాజేష్ పాండే, బీహార్ ఐపీఎస్ అధికారి పరేష్ సక్సేనా, ఉత్తరప్రదేశ్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి దినేష్ చంద్ర, మాజీ ఐఏఎస్ అధికారి యోగేశ్వర్ రామ్ మిశ్రా పేర్లు చర్చలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నలుగురిలో తుది ముగ్గురి ప్యానెల్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. షార్ట్‌లిస్ట్ అయిన 16 మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది సైనిక, పరిపాలనా రంగాల నేపథ్యం కలిగినవారే ఉన్నారు. నాయకత్వ సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం, పని అనుభవం, నిజాయితీ, దార్శనికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను అంచనా వేశారు.

ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ
సీఈవో ఎంపిక కోసం ఏర్పాటు చేసిన అన్వేషణ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది, డాక్టర్ సురేష్ హవారే ఉన్నారు. న్యాయవ్యవస్థ, సైనిక రంగం, అణు శాస్త్ర రంగాల్లో వీరికి విస్తృత అనుభవం ఉంది. కమిటీ తన తుది నివేదికను సెప్టెంబర్ 1న ట్రస్ట్‌కు సమర్పించింది. ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి ముందే పూర్తయిందని కమిటీ కార్యదర్శి సమీర్ పాండా తెలిపారు.

సెప్టెంబర్ 2న తుది నిర్ణయం
ఇప్పుడు తుది నిర్ణయం రామ మందిర ట్రస్ట్ చేతిలో ఉంది. సెప్టెంబర్ 2న జరిగే సమావేశంలో సెర్చ్ కమిటీ సమర్పించిన పేర్లను పరిశీలించి ఒకరిని తొలి సీఈవోగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ట్రస్ట్‌లో ఖాళీగా ఉన్న ఇతర పదవుల భర్తీపైనా ఇదే సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

జూలై 1న ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ
రామ మందిర ట్రస్ట్ సీఈవో ఎంపిక ప్రక్రియ జూలై 1న ప్రారంభమైంది. ఎంపిక, అర్హతా ప్రమాణాలపై చర్చించేందుకు తొలి సమావేశం నిర్వహించారు. జూలై 6న ఎంపిక కమిటీని ఏర్పాటు చేయగా, జూలై 14న సమీర్ పాండాను కమిటీ కార్యదర్శిగా నియమించారు. దరఖాస్తుల స్వీకరణ జూలై 18న ముగిసింది. తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, అయోధ్యలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను ట్రస్ట్‌కు సమర్పించారు. దీంతో సెప్టెంబర్ 2న జరగనున్న సమావేశంపై ఆసక్తి నెలకొంది.