Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?

Raksha Bandhan 2026

Raksha Bandhan 2026

Raksha Bandhan 2026: తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి రోజున ఘనంగా జరుపుకుంటారు. 2026లో ఈ పండుగ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం సంభవించనుండటంతో పాటు, పండుగ తేదీ, శుభ ముహూర్తంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆగస్టు 28న ఉండటంతో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, 2026న నిర్వహిస్తారు.

రాఖీ కట్టేందుకు ఆగస్టు 28న ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల వరకు అత్యంత శుభ సమయంగా భావిస్తున్నారు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే భద్ర కాలం ముగియడం వల్ల పండుగ ఆచారాలను రోజు ప్రారంభం నుంచే ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించవచ్చు. ఈ రోజున ఇతర ముఖ్యమైన శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుంచి 5:12 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు, అమృత్ కాల్ ఉదయం 7:44 నుంచి 9:23 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో కూడా పూజలు, శుభకార్యాలు నిర్వహించవచ్చు.

ఇదిలా ఉండగా, ఆగస్టు 28న ఉదయం 6:55 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల సూతక కాలం వర్తించదు. దీంతో రక్షాబంధన్ పండుగ ఆచారాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పండితులు పేర్కొంటున్నారు. అందువల్ల సోదరీమణులు ఎలాంటి సందేహం లేకుండా నిర్ణీత శుభ ముహూర్తంలో తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తూ ఈ పవిత్ర పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.