Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..

  • ఉమ్రా కోసం మరోసారి మక్కాకు వెళ్లిన రాఖీ సావంత్.
  • బురఖా, హిజాబ్ ధరించి ప్రార్థనలు చేసిన నటి.
  • నేపాల్ వరదల్లో చిక్కుకున్న ప్రజల క్షేమం కోసం కన్నీళ్లతో ప్రార్థనలు.
  • భారతదేశంలోని జెన్-జీ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన రాఖీ.
Rakhi

Rakhi

Rakhi Sawant:  బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి మక్కాకు వెళ్లారు. ఉమ్రా కోసం మక్కాకు వెళ్లిన ఆమె, నల్ల బురఖా ధరించి ప్రార్థనలు చేశారు. నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న ప్రజల భద్రతతో పాటు భారతదేశంలో జెన్-జీ యువత భవిష్యత్తు కోసం కన్నీటితో అల్లాను ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఖీ సావంత్, ఆదిత్ ఖాన్ దుర్రానీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

మక్కా నుంచి రాఖీ షేర్ చేసిన వీడియోలో నేపాల్‌లో కొనసాగుతున్న వరదలు, ప్రకృతి విపత్తు ఆగిపోవాలని ప్రార్థించారు. పిల్లలు, వృద్ధులు, జంతువులు సురక్షితంగా ఉండాలని అల్లాను వేడుకున్నారు. వరదల్లో చిక్కుకున్న నేపాలీలు, భారతీయులు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. భారతదేశాన్ని కాపాడాలని, విద్యా వ్యవస్థను రక్షించాలని, జెన్-జీ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావాలని కోరుతూ అల్లాను వేడుకున్నారు. జెన్‌జీ యువతకు విద్యా, భవిష్యత్తు, ఆశీర్వాదాలు కలగాలని, దేశ మంత్రులు నిజాయితీతో వ్యవహరించాలని కూడా ప్రార్థించారు.

యువత తమ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టొద్దని, ముఖ్యంగా ఖరీదైన వస్తువులు, ఐఫోన్ వంటి వాటి కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. మీ జీవనోపాధిని మీరే సంపాదించుకోవాలని, మీ జీవితాన్ని మీరే జీవించాలని, మీ తల్లిదండ్రులకు సేవ చేయాలని యువతకు సందేశం ఇచ్చారు. అయితే, రాఖీ సావంత్ ప్రార్థనలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆమె ప్రార్థనల్ని ప్రశంసించగా, మరికొందరు ఆమె మత మార్పు గురించి విమర్శలు చేస్తున్నారు.