Rajya Sabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ వాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ను బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ‘‘లుంగీ వాలా’’ అని పిలిచారని ఆరోపించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అయితే, తాను ఈ పదాన్ని ఉపయోగించలేదని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. సోమవారం సభలో ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్పై చర్చ సందర్భంగా తాను మాట్లాడుతున్నప్పుడు సుస్మితా పలుమార్లు లుంగీవాలా అని పిలిచారని బ్రిట్టాస్ ఆరోపించారు. తాను మలయాళీగా, దక్షిణ భారతీయుడిగా గర్విస్తున్నానని, భారత సంస్కృతిలోని దుస్తులను అవమానకరంగా చూడటం మంచిది కాదని ఆయన అన్నారు.
బ్రిట్టాస్ ఆరోపణలను సుస్మితా ఖండించారు. తాను ఏ రాష్ట్రానికి చెందిన దుస్తుల్ని అవమానించలేదని రాజ్యసభలో వివరణ ఇచ్చారు. తాను అస్సాంకు చెందిన బెంగాలీని అని, వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన సంప్రదాయ దుస్తులు ధరించడం తాను చూశానని, లుంగీవాలా అనే పదాన్ని తాను ఉపయోగించలేదని, విచారన జరిగితే వాస్తవం బయటపడుతుందని అన్నారు. బ్రిట్టాస్ తప్పుడు ఆరోపణలు చేశారని, అతడిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. సంస్కృతి లేదా మతం ఆధారంగా భారతదేశాన్ని విభజించాలని ఒక సభ్యుడు కోరుకుంటున్నారనే సందేశాన్ని రాజ్యసభ పంపకూడదని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దక్షిణ భారత సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దుస్తులు, ఆహారం, రంగు వంటి అంశాలను రాజకీయ విభేదాలకు ఉపయోగించడం దేశంలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ వివాదంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయొం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సభ గౌరవాన్ని కాపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇరువురు ఎంపీలు తన ఛాంబర్కు పిలిచిన రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

