NTV Telugu Site icon

Rahul Gandhi: వయనాడ్‌ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. అయితే ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని కోరారు.

బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. వయనాడ్ విలయం తర్వాత కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ ప్రదేశంలో కీలకమైన రహదారులు దెబ్బతిన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. వందలాది మంది మృతి చెందగా.. చాలా మంది ఆచూకి తెలియలేదన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించారు.