BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్‌’’ వీడియోతో బీజేపీ కౌంటర్..

  • రాహుల్ గాంధీ ‘‘మనుస్మృతి’’ వ్యాఖ్యల వివాదం..
  • గతంలో హిజాబ్ గురించి మాట్లాడిన వీడియో షేర్ చేసిన బీజేపీ..
  • రాహుల్ కపటత్వానికి పరాకాష్ట అంటూ బీజేపీ ఫైర్..
  • మతం ఆధారంగా పోరాటమా? అని ప్రశ్న..
Rahul Gandhi

Rahul Gandhi

BJP:  ఇటీవల పూణేలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహించిన  కార్యక్రమంలో ‘‘మనుస్మృతి’’పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, రాహుల్ కామెంట్స్‌కు ‘‘హిజాబ్ వీడియో’’తో బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయనపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీకి చెందిన పాత వీడియోను బీజేపీ ‘‘ఎక్స్’’లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో హిజాబ్ ధరించడాన్ని మహిళా స్వేచ్ఛకు ముడిపెట్టడం గురించి రాహుల్ ఒక అమ్మాయిని ప్రశ్నిస్తూ కనిపించారు. ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెబుతూ.. ‘‘ నా అభిప్రాయం ప్రకారం, ఒక మహిళ హిజాబ్ ధరించాలా వద్దా అనేది ఆమె ఇష్టం. ఆమె అబయాలేదా మరేదైనా ధరించాలనుకుంటే, అది ఆమె ఎంపిక, ఆమె వ్యక్తిగత విషయం. ఆమెను అలా చేయడానికి అనుమతించాలి.’’ అని చెబుతారు.

ఈ వీడియోపై బీజేపీ మాట్లాడుతూ.. ‘‘ఇది పరాకాష్టకు చేరిన కపటత్వం. రాహుల్ గాంధీ మనస్మృతి, హిందూ మహిళల గురించి మాట్లాడినప్పుడు, పితృస్వామ్యాన్ని అణచివేయడం గురించి మాట్లాడుతారు. కానీ హిజాబ్, అబాయాల విషయానికోస్తే అది వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక స్వేచ్ఛ ఎలా అవుతుంది.? రాహుల్ గాంధీ పోరాటం మతంపై మాత్రమే ఆధారపడి ఉందా.? మహిళా సాధికారతే లక్ష్యం అయితే, ప్రతి మహిళకు ఒకే ప్రమాణాలు ఉండకూడదా?’’ అని ప్రశ్నించింది.

పూణే కార్యక్రమంలో రాహుల్ ఏమన్నారు.?

2026 ఆగస్టు 22న పూణేలోని AISSMS కళాశాల మైదానంలో జరిగిన “స్కూల్స్ ఎకో” కార్యక్రమంతో ఈ వివాదం మొదలైంది. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహిళలను తల్లి, భార్య లేదా కుమార్తె వంటి సాంప్రదాయ పాత్రలకే పరిమితం చేయకూడదని పేర్కొన్నారు. మనుస్మృతిని ప్రస్తావిస్తూ.. మహిళలు ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని చెబుతుందని, బాల్యంలో తండ్రులకు, కౌమారదశలో భర్తలకు, భర్తల మరణానంతరం కుమారులకు లోబడి ఉంటారని అన్నారు. మహిళలు స్వతంత్రంగా ఉండటం, తమ కోసం తాము నిలబడటం, తమపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం దేశానికి అతిపెద్ద బలం అవుతుందని అన్నారు.