Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ

  • పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సంభాషణ
  • రాహుల్ గాంధీ గదికి వెళ్లిన కేంద్రమంత్రి
  • 5 నిమిషాల పాటు సరదా సంభాషణ
Rahulgandhi1

Rahulgandhi1

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం ఎంత హాట్ హాట్‌గా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక బుధవారం సభలో రాహుల్ గాంధీ చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని వాయిదా పడింది. అయితే కొద్దిసేపటికే పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ-కిరణ్ రిజిజు సరదాగా ముచ్చటించుకుంటున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభలోనేమో ఫైటింగ్.. బయట ముచ్చట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం లోక్‌సభ వాయిదా పడ్డాక రాహుల్ గాంధీ-కిరణ్ రిజిజు పార్లమెంట్ భవనంలో కలుసుకున్నారు. రాహుల్ గాంధీ.. కిరణ్ రిజిజు చేయి పట్టుకుని తన గదికి ఎప్పుడైనా వచ్చారా? అని అడిగారు. దీంతో రిజిజు రాలేదని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ నవ్వి… ‘ఈరోజు నా గదికి వెళ్దాం’ అంటూ తీసుకెళ్లారు. పార్లమెంట్‌లోని జీ-41 గదికి వెళ్లారు. దాదాపు 5 నిమిషాల పాటు కిరణ్ రిజిజు గడిపారు. ఈ సమయంలో ఇద్దరు నాయకులు ఫొటోలకు పోజులిచ్చారు. రాహుల్ గాంధీ గదిలో కైలాస్ మానసరోవర్ చిత్రం వేలాడదీసి ఉంది. రాహుల్.. రిజిజుతో ‘‘రా.. ఈ చిత్రం ముందు ఒక ఫొటో తీసుకుందాం’’ అంటూ పిలిచారు. దీంతో ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు.

ఇద్దరు నాయకులు పార్లమెంటరీ ప్రతిష్టంభన గురించి గానీ, మరే ఇతర రాజకీయ అంశం గురించి గానీ చర్చించలేదు. ఇద్దరూ అనధికారిక సంభాషణలో నిమగ్నమవ్వడంతో ఈ సమావేశం ఆహ్లాదకరంగా జరిగింది. ఇక రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజులు ఇలాంటి ఆత్మీయ సంభాషణ జరుపుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ దాడి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక స్మారక సభలో కూడా ఇద్దరు నాయకులు సరదాగా మాట్లాడుకున్నారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ టీ-షర్టు ధరించి ఉండటంతో ఆయన ఫిట్‌నెస్‌పై రిజిజు సరదాగా వ్యాఖ్యానించారు.