Puri jagannath temple: ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం గురువారం 4 గంటల పాటు మూతపడనుంది. రహస్యమైన ‘‘బనకలగి’’ ఆచారం కోసం ఆలయ ద్వారాన్ని నాలుగు గంటల పాటు మూసేయనున్నారు. సాధారణ భక్తులను ఈ నాలుగు గంటలు గుడిలోకి అనుమతించరు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు.
ఈ సమయంలో ఆలయంలో బనకలగి అనే ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దీనిని ‘‘శ్రీముఖ శృంగారం’’ అని కూడా పిలుస్తారు. ఇది జగన్నాథ ఆలయంలో జరిగే అత్యంత రహస్య పూజల్లో ఒకటి. ఈ సమయంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్రా దేవతామూర్తుల విగ్రహాల ముఖాలకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన రంగులు, పవిత్ర పదార్థాలతో దేవీదేవతల ముఖంపై లేపనం చేస్తారు. దీని వల్ల దేవతల రూపం మరింత దివ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఈ పూజను రహస్యంగా నిర్వహిస్తారు. పూజ జరుగుతున్న సమయంలో ఆలయ ద్వారాలు మూసేస్తారు. కొద్ది మంది ప్రత్యేక సేవాయతులు మాత్రమే ఈ పూజలో పాల్గొంటారు. ఈ సంప్రదాయం ప్రకారం దత్త మహాపాత్ర సేవాయతులు మాత్రమే పూజల్ని నిర్వహిస్తారు. తరతరాలుగా వీరే ఈ ప్రత్యేక పూజను నిర్వహించే హక్కును కలిగి ఉన్నారు. బనకలగి పూజలో ఉపయోగించే పదార్థాలు పూర్తిగా సహజసిద్ధమైనవే. వీటిలో ఔషద మూలికలతో తయారైన రంగులు, కస్తూరి, కర్పూరం వంటివి వాడుతారు. ఈ సమయంలో జగన్నాథ ఆలయ పరిపానల ఆలయ నియమాలపై కఠినంగా వ్యవహరిస్తుంది.
