పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) మృతి చెందారు. అమృత్సర్లోని భగ్తావాలా ధాన్యం మార్కెట్లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ASI హర్జీత్ సింగ్ భగ్తావాలా గ్రెయిన్ మార్కెట్లో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో పలుమార్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హర్జీత్ సింగ్ను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన ASI హర్జీత్ సింగ్ తర్న్ తరన్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.

