మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఫ్యామిలీని మళ్లీ కొత్త కేసులు వెంటాడుతున్నాయి. గతేడాదంతా పూజా ఖేద్కర్ను కేసులు వెంటాడాయి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ ఇరాకటంలో పడింది. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీ విచారణ చేపట్టగా.. పూజా ఖేద్కర్ సమర్పించిన పత్రాలన్నీ నకిలీ అని తేలడంతో ఐఏఎస్ సర్వీస్ నుంచి సస్పెండ్ అయింది.
ఇది కూడా చదవండి: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్మెంట్
తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ను కిడ్నాప్ చేసిన కేసు వెంటాడుతోంది. నవీ ముంబైలోని ఐరోలి సిగ్నల్ దగ్గర మిక్సర్ ట్రక్కు-కారు ఢీకొన్నాయి. MH 12 RT 5000 నంబర్ ప్లేట్ ఉన్న కారును మిక్సర్ ట్రక్కు ఢీకొట్టింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ను కారులో ఉన్న వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రహ్లాద్ కుమార్ను బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును పూణెలోని చతుశృంతి ప్రాంతంలోని పూజా ఖేద్కర్ ఇంట్లో గుర్తించారు. దీంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పూజా ఖేద్కర్ తల్లి మనోరమ రెచ్చిపోయింది. లోపలికి అనుమతించకపోగా.. పోలీసులపై కుక్కలను ఉసిగొల్పింది. ఎట్టకేలకు గోడ దూకి డ్రైవర్ను రక్షించారు. కానీ పూజా ఖేద్కర్ తండ్రి పారిపోయాడు. పోలీస్ స్టేషన్కు వస్తామని మనోరమ చెప్పినా.. వెళ్లలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పింది.
ఇది కూడా చదవండి: Cloudburst: డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు
అయితే ట్రక్కు డ్రైవర్ను పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కరే కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు. రూ.2 కోట్ల ఖరీదైన కారును ఢీకొట్టాడన్న కారణంతో ట్రక్కు డ్రైవర్ను దిలీప్ ఖేద్కర్, అతని సహాయకుడు ప్రఫుల్ సలుంఖే కలిసి కిడ్నాప్ చేసి పూణెకు తీసుకెళ్లిపోయారు. అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే.. భర్త పారిపోయేందుకు పూజా ఖేద్కర్ తల్లి మనోరమ పోలీసులపైకి కుక్కలను వదిలిపెట్టింది.
పోలీసుల విధులను అడ్డుకున్నందుకు మనోరమ ఖేద్కర్పై పూణె పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నవీ ముంబై పోలీసులు దిలీప్ ఖేద్కర్, అతని సహాయకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కానీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ట్రక్కు డ్రైవర్కు దిలీప్ ఖేద్కర్ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం డ్రైవర్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు.
