Prashant Kishor: ఇప్పటి వరకు ఇతరుల గెలుపుకోసం వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్.. తొలిసారి తనకు తాను కొత్త వ్యూహాలతో ముందడుగు వేశారు.. చివరకు విజయం సాధించారు.. అయితే, బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రవేశం కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు బీహార్ అసెంబ్లీలో చర్చలు ప్రధానంగా ఆరోపణలు, కుల సమీకరణాలు, రాజకీయ విమర్శల చుట్టూనే సాగేవి. అయితే ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ శాసనసభలో అడుగుపెడితే, చర్చల స్వరూపం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణాంకాలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు, ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణలతో ఆయన వ్యవహరించే తీరు అసెంబ్లీ చర్చలకు కొత్త దిశ చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుభవం పీకే సొంతం.. అదే సర్కార్కు ఇరకాటం..!
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలను రూపొందించిన అనుభవం ప్రశాంత్ కిషోర్కు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సామాజిక సూచికలు, ఎన్నికల ధోరణులు వంటి అంశాలను ఆయన సంవత్సరాలుగా అధ్యయనం చేశారు. అందువల్ల కేవలం రాజకీయ నినాదాలు కాకుండా, గణాంకాలు, ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి కొత్త సవాలు ఎదురుకానుంది. ముఖ్యమంత్రి హోదాలో ఇకపై కేవలం రాజకీయ ప్రసంగాలు సరిపోవని, గత కొన్నేళ్లుగా ప్రశాంత్ కిషోర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ఆరోగ్య సేవలు, వలసల సమస్య, మద్యపాన నిషేధం అమలు, గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు, గణాంకాలను ప్రస్తావిస్తూ వచ్చారు. అదే శైలిని శాసనసభలోనూ కొనసాగిస్తే, ప్రభుత్వం మరింత సన్నద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
ప్రతిపక్షానికీ సవాలే..!
ప్రశాంత్ కిషోర్ వల్ల సవాలు ఎదుర్కొనేది అధికార పక్షం మాత్రమే కాదు. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్కూ ఇది రాజకీయంగా కీలక పరీక్షగానే మారనుంది. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక స్వరంగా తేజస్వి యాదవ్ నిలిచినా, ఇప్పుడు అసెంబ్లీలో మరో ప్రభావవంతమైన వక్తగా ప్రశాంత్ కిషోర్ ఎదిగితే ప్రతిపక్ష రాజకీయాల్లో కూడా పోటీ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద ఎవరి విమర్శలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని మీడియా, రాజకీయ వర్గాలు నిశితంగా గమనించే అవకాశముంది. ఇద్దరి రాజకీయాల మూలాధారం కూడా భిన్నంగా ఉంది. తేజస్వి యాదవ్ సామాజిక న్యాయం, సంప్రదాయ కుల సమీకరణాల రాజకీయాలను ముందుకు తీసుకెళ్తుండగా, ప్రశాంత్ కిషోర్ మాత్రం కుల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఆధారిత రాజకీయాల ప్రతినిధిగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను కేవలం అధికార ప్రభుత్వాన్నే కాకుండా, బీహార్ రాజకీయ వ్యవస్థ మొత్తాన్నే సవాలు చేస్తున్నానని ఆయన తరచూ చెబుతూ వచ్చారు. అందుకే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయంలో ఆర్జేడీని కూడా ఆయన లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చకు వస్తున్న అనేక సమస్యల్లో ఆర్జేడీ 15 ఏళ్ల పాలన పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం రెండింటినీ ఒకేసారి లక్ష్యంగా చేసుకునే ఆయన రాజకీయ శైలి శాసనసభలో కూడా కొనసాగవచ్చని భావిస్తున్నారు.
బీహార్లో త్రిముఖ రాజకీయం..! పీకేకి సవాల్..
ఈ పరిణామాలు బీహార్ అసెంబ్లీలో త్రిముఖ రాజకీయ పోటీకి దారితీయొచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, మరోవైపు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, వీరిద్దరి మధ్య సంఖ్యాపరంగా చిన్న బలం ఉన్నప్పటికీ చర్చల్లో ప్రభావం చూపే ప్రయత్నం చేసే ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ ముందున్న సవాలు కూడా చిన్నది కాదు. ఇప్పటివరకు ఎన్నికల వ్యూహకర్తగా బయటి నుంచి ప్రభుత్వాలను విమర్శించిన ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు నేరుగా జవాబుదారిగా ఉండాల్సి ఉంటుంది. బంకిపూర్ నియోజకవర్గ ప్రజలు రహదారులు, మురుగునీటి పారుదల, తాగునీరు, విద్యుత్, పోలీసు వ్యవస్థ, ఆసుపత్రులు, స్థానిక అభివృద్ధి వంటి సమస్యలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. అసెంబ్లీలో చేసే ప్రతి వ్యాఖ్యను నియోజకవర్గంలో ఆయన పనితీరుతో ప్రజలు బేరీజు వేసే పరిస్థితి ఉంటుంది.
అందువల్ల వ్యవస్థలో లోపాలపై విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, వాటి పరిష్కారానికి ఎమ్మెల్యేగా తాను తీసుకున్న చర్యలను కూడా ప్రశాంత్ కిషోర్ నిరూపించాల్సి ఉంటుంది. శాసనసభలో వాస్తవాలు, గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, నియోజకవర్గ అభివృద్ధిలోనూ చురుకైన పాత్ర పోషించగలిగితే జన్సురాజ్ పార్టీకి బీహార్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయన రాజకీయాలు కేవలం ప్రచారం, వార్తా శీర్షికలకే పరిమితమయ్యాయని విమర్శలు ఎదుర్కొనే అవకాశమూ ఉంది. ఎంతైనా ఒకరి కోసం వ్యూహాలు రూపొందించి సూచించడం ఓ ఎత్తైతే.. ఇప్పుడు తనుగా వ్యూహాలతో ముందుకు వెళ్లడం కూడా పీకేకి కొత్త సవాల్గానే చెప్పాలి..

